విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ఇప్పటికీ కొన్ని ఆశలున్నాయి.ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు సంబంధించి నానా మాటలూ వినిపిస్తున్నా కొన్ని ప్రతిపాదనలు అయితే వినేందుకు బాగానే ఉన్నాయి.వీటిలో ముఖ్యమయినది విశాఖ స్టీల్ ప్లాంట్ ను రతన్ టాటా టేకోవర్ చేసుకోవడం.దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థను సొంతం చేసుకుని ఇవాళ్టి నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో సర్వీసులు ప్రారంభించనున్న టాటా కంపెనీ అదే ఒరవడిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కొనుగోలు చేస్తుందని ఓ ఆశ.
ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బాగానే కాదు భారీగానే ఆస్తులు ఉన్నాయి. బయట ఆస్తుల విలువే ఓ వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది. అందుకే వైజాగ్ స్టీల్ ను అమ్ముకుంటేనే లాభదాయకం అని అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఎక్కువగానే ఆశలు పెట్టుకుంటున్నాయి అన్న వాదన ఒకటి ప్లాంటు వాసుల నుంచి వినిపిస్తుంది.ఎందుకంటే భూములను అమ్ముకుని ఎవరికి వారు ఆస్తులు పెంచుకోవచ్చు అన్న అభిప్రాయం ఇరు పార్టీలలో ఉంది అన్న విమర్శ కూడా వినిపిస్తుంది.
ఇదే సమయంలో ఇక్కడి ఉద్యోగ సంఘాలు కూడా రాజకీయ పార్టీలతో చేతులు కలిపి ప్లాంట్ కు భవిష్యత్ అన్నది లేకుండా చేస్తున్నారన్న వాదన సాక్షాత్తూ ఉద్యోగులలోనే వినిపిస్తుంది.ఇలాంటి పరిణామాల్లో బీజేపీ కూడా కాస్తో కూస్తో తన సొంత లాభం చూసుకోకుండా ఎలా ఉంటుందని ఎప్పటి నుంచో కమ్యూనిస్టు పార్టీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఈ విధంగా ప్రధాన పార్టీల నాయక వర్గాలు అన్నీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదని తేలిపోయింది. ఈ దశలో ప్లాంటును టాటా కంపెనీ ఓన్ చేసుకుంటే మంచిది అన్న భావన దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది.