రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో బీఆర్ఎస్ ట్రయల్ రన్ నిర్వహించబోతోంది. ట్రయల్ రన్ అంటే ఏమిటంటే లోక్ సభ ఎన్నికలకు ముందుగా జరగబోతున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేస్తుంది. ఈ విషయాన్ని కేసీయార్ సెంటిమెంటుగా భావిస్తున్నారట. 2001లో తెలంగాణాలో కూడా అప్పటి టీఆర్ఎస్ ఇలాగే తన ఎంట్రీని చాటుకుంది. అప్పట్లో కూడా జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొనే ముందు జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీచేసి జనాల్లో తన పట్టేమిటో పరీక్షించుకుంది.





అదే పద్దతిలో ఇపుడు కూడా స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీచేసి ప్రజల్లో తనకున్న పట్టేమిటో నిరూపించుకోవాలని, పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరో రెండునెలల్లో మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రమంతా ఎన్నికలు జరుగుతున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసీయార్ దృష్టిపెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం.





ముఖ్యంగా తెలంగాణా సరిహద్దులకు ఆనుకుని ఉండే జిల్లాలపైన ఎక్కువ దృష్టిపెట్టారట. మరాఠ్వాడ ప్రాంతంలోని ఔరంగాబాద్, నాంథేడ్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 8 జిల్లా పరిషత్తులు, 76 పంచాయితీ సమితులు, 43 మున్సిపాలిటీలు ఉన్నాయట. వీటిల్లో ఎన్ని వీలైతే అన్నిచోట్ల పోటీచేయాలన్నది కేసీయార్ టార్గెట్ గా చెబుతున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాబోయే ఓట్లు, సీట్లను గమనించి తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ విషయమై నిర్ణయం తీసుకోవాలని కేసీయార్ అనుకుంటున్నట్లు సమాచారం.





ఇందులో భాగంగానే తెలంగాణా సరిహద్దు ప్రాంతాల్లోని తటస్తులు, ఇతర పార్టీల్లోని నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునే విషయమై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమపథకాలు రైతుబందు, రైతుబీమా తదితరాలను బాగా ప్రచారం చేయాలని కేసీయార్ ఆదేశించారు. ఇలాంటి పథకాల అమలుపై సరిహద్దుల్లోని నిజామాబాద్, కరీనంగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రజల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు కొంత సమాచారం ఉంది. దాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలన్నది కేసీయార్ ఆలోచన. మొత్తంమీద స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీ  ద్వారా మహారాష్ట్రలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వబోతోందని అర్ధమవుతోంది. మరి ట్రయల్ రన్ ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: