ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబుపై పార్టీ సహా పారిశ్రామిక వర్గా ల నుంచి కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ దఫా మొత్తం మూడు రాజ్యసభ సీట్లు ఏపీకి దక్కాయి. వీటిలో ఒకటి సీఎం రమేష్ పదవీ కాలం తీరిపోతుండడంతో ఖాళీ అవుతున్నదే. ఇక, మొత్తం మూడు సీట్లలో రెండు టీడీపీకి , ఒకటి వైసీపీకి దక్కనున్నాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, టీడీపీలోని రెండు సీట్లకు భారీ ఎత్తున పోటీ నెలకొంది. సిట్టింగ్ గా ఉన్న సీఎం రమేష్ తిరిగి తననే రెన్యువల్ చేయాలని అధినేతపై ఒత్తిడి పెంచుతున్నాడు.
అయితే, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రకారం.. రమేష్కి రెన్యువల్ చేసే విషయం యాభై శాతం జరగదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీంతో ఈ రెండు సీట్లలో పోటీ భారీ ఎత్తున ఉంది. ఏపీలోనే నేతలు క్యూకడుతున్నారు. కంభంపాటి రామ్మోహనరావు కూడా రేసులో ముందంజలో ఉన్నారు. గతంలో విజయవాడ నగర మేయర్గా చేసి, రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన పంచుమర్తి అనురాధ కూడా రాజ్యసభకు తలపడుతున్నారు. తమ పేరును ప్రతిపాదించాలన ఆమె అధినేతపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ సీటును ఇచ్చినా గతంలో తాను తీసుకోలేదని, ఇప్పుడు ఈ సీటునైనా తనకు కేటాయించాలని ఆమె అధినేతను బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి రాజ్యసభ వెళ్ళాలనే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూడా రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నారు. ఇక, ఆంధ్ర అంబానీగా పేరు సంపాయించిన మధవరావు కూడా రాజ్యసభకు పోటీ వస్తున్నారు.
మరోపక్క ఏపీ టీడీపీ రాజ్యసభ రేసులో తమకు ఒక్కసీటైనా కట్టబెట్టాలని తెలంగాణ టీడీపీ సీనియర్లు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు కోరుతున్నారు.
తెలంగాణాకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తనకు అవకాశం కల్పించాలని ఒత్తిడి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇదే తరహాలో డిమాండ్ చేస్తే..ఆయనకు గవర్నర్ ఆశ చూపించారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. తాజాగా టీ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే వివాదస్పద వ్యాఖ్యలతో మోత్కుపల్లి పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రావుల తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తతం ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్ధం కావడంలేదని అమరావతి వర్గాలు అంటున్నాయి. మరి ఎవరికి వీర తాడు వేస్తారో చూడాలి.