వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ఏపీలో మెజార్టీ ఓటర్ల అభిప్రాయంగా కనపడింది. పోలింగ్కు ముందే ఈ సారి జగన్ చాలా కష్టపడ్డాడు... ఓ అవకాశం ఇచ్చి చూద్దాం అన్న భావన వారిలో బలంగా కనపడింది. జగన్ తండ్రి రాజశేఖర్రెడ్డి ఏం ? చేస్తాడని చాలా మంది ఎద్దేవా చేశారు. అలాంటి వైఎస్ సీఎంగా గెలిచిన వెంటనే చేసిన సంస్కరణలు యావత్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. అందుకే వైఎస్ 2009లో అటు చంద్రబాబు, ఇటు చిరంజీవి లాంటి వాళ్లు పోటీలో ఉన్నా ఘనవిజయం కట్టబెట్టారు. రెండోసారి చంద్రబాబు వైఎస్ను ఓడించేందుకు కేసీఆర్, కమ్యూనిస్టులు ఇలా అందరితోనూ ఒక్కటై చిత్తయ్యారు.
ఇక ఈ ఎన్నికల్లో అందరూ జగన్ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డితే ఆయన సొంత బంధువులే కొన్ని చోట్ల వెన్నుపోట్లు పొడిచినట్టు తెలుస్తోంది. జగన్ తన బంధువుల్లో చాలా మందికి రాజకీయంగా ఎంతో లైఫ్ ఇచ్చాడు. వారిలో ఓ సీనియర్ నేత గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కొన్ని ఈక్వేషన్ల కారణంగా జగన్ ఆయనకు సీటు ఇవ్వలేదు. ఈ సారి ఆయన ఈ ఎన్నికల్లో తన సొంత జిల్లాలో పార్టీ గెలుపు విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. తనకు ఇన్చార్జ్ పగ్గాలు ఇచ్చినచోట్ల మినహా సొంత జిల్లా, తాను ప్రాధినిత్యం వహించిన సీటుతో పాటు తన సొంత నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఏ మాత్రం కృషి చేయలేదని తెలుస్తోంది.
జిల్లాలో జగన్కు మరో దగ్గర బంధువుతో ఈ బంధువుకు ఉన్న వైరం నేపథ్యంలో సదరు నేత తన ప్లేస్లో పోటీ చేసిన వ్యక్తిని ఓడించేందుకు తెరవెనక పావులు కదిపినట్టు కూడా వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తనకు బదులుగా పోటీ చేసిన వ్యక్తిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా తన వర్గంతో క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. జిల్లాలో తాను గత ఎన్నికల్లో గెలిచినా జగన్ తనకు పెత్తనం అప్పగించకపోవడంతో పాటు గత ఎన్నికల్లో ఓడిన తన బంధువు ఆధిపత్యాన్ని ఆయన సహించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తన సొంత నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలకంగా ఉండే జగన్ సమీప బంధువు ఈ ఎన్నికల్లో అసలు తాను కాని.. ఆయన సోదరులు కాని ఇన్వాల్ కాకుండా ఉండేలా చేశారు. దీంతో సదరు నేత సొంత నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎన్నో ఆశలతో చాలా రోజుల తర్వాత పోటీ చేసిన సీనియర్ నేత గెలుపు ఆశలు సన్నగిల్లిపోయాయి. ఏదేమైనా జగన్ను ఈ సారి సీఎం చేయాలని ఏపీలో మెజార్టీ ప్రజలు కసితో ఉంటే సొంత బంధువులే తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర పన్నడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది.