ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో యువతులను యువకులు శారీరకంగా వాడుకొని మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక యువకుడు యువతిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ప్రేమ పేరుతో తనను శారీరకంగా, మానసికంగా ఒక యువకుడు మోసం చేశాడనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడు పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని కోరాడని... మతం మారినా పెళ్లి చేసుకోకుండా తనను మోసం చేశాడని అన్నారు. ఈరోజు ఉదయం అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో యువతి యువకుడిపై ఫిర్యాదు చేశారు. 
 
బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం ఐదేళ్ల క్రితం యువతికి సయ్యద్ ఇమ్రాన్ హైమద్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి అందుకు అంగీకరించింది. ఆ తరువాత ఇమ్రాన్ హైమద్ యువతిని హోటల్ కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చటంతో ఇమ్రాన్ బలవంతంగా యువతికి అబార్షన్ చేయించాడు. 
 
ఆ తరువాత యువతి ఫోన్ చేసినా ఇమ్రాన్ స్పందించలేదు. తనను మోసం చేశాడని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనను ఇమ్రాన్ మోసం చేశాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులను కోరింది. గతంలోనే పోలీస్ స్టేషన్ లో ఇమ్రాన్ పై ఫిర్యాదు చేశానని పోలీసులు స్పందించకపోవటంతో మరోసారి పోలీస్ స్టేషన్ కు వచ్చానని యువతి తెలిపింది. 
 
బాధితురాలి కోరిక మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: