కేంద్ర అధికార పార్టీ గా బిజెపి ఏపీలో మాత్రం తన ప్రభావాన్ని చూపించ లేకపోతోంది. చిన్నా చితకా పార్టీలు కూడా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నా... బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇంకా బలపడలేకపోవడం ఆ పార్టీ నేతలకు కూడా మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో బిజెపి పోటీచేసినా పరాభవమే ఎదురైంది. కనీసం ఒక స్థానంలో కూడా బిజెపి బల పడలేకపోగా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థితిలో బిజెపి ఉండిపోయింది. మొన్నటి వరకు బీజేపీలోకి నియోజకవర్గ స్థాయి నాయకులు క్యూ కట్టినా ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండడంతో తమకు సరైన ప్రాధాన్యత దక్కుతుందని, నామినేటెడ్ పోస్టుల్లో కొలువు తీరవచ్చని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు భారీగా ఆశలు పెట్టుకుని బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అలాగే టిడిపిలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనుకున్న వారు, ఐటీ దాడులు, ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నవారు అంతా వచ్చి బిజెపిలో చేరిపోయారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు వరకు బీజేపీలోకి వలసలు బాగానే జరిగాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజల ఆదరణ ఉంటుందో ఒక క్లారిటీ వచ్చిన తరువాత బిజెపి తీర్థం పుచ్చుకోవాలని, పరిస్థితులు బాగోకపోతే ఉన్న పార్టీలోనే ఉండి పోవాలని చాలామంది నాయకులు బిజెపిలో చేరకుండా వేచి చూస్తున్నారు. అలాగే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బాగానే పుంజుకున్నట్టుగా కనిపించడంతో బిజెపిలో చేరాలనుకున్న నాయకులంతా మరికొన్ని రోజులపాటు వేచి చూస్తే బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు. అందుకే కొంత కాలంగా బీజేపీలోకి వలసలు పూర్తిగా తగ్గిపోయాయి.
అంతకుముందే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ మంత్రి జమ్మలమడుగు నాయకుడు ఆదినారాయణ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతానికి బీజేపీ వైపు చూసే వారు కనిపించకపోవడం బిజెపి అగ్రనాయకులు సైతం మింగుడు పడడం లేదు. ప్రస్తుతం బీజేపీ వ్యవహారం చూస్తుంటే భవిష్యత్తులోనూ ఆ పార్టీ బలపడే అవకాశం ఉందన్న నమ్మకం కూడా నాయకుల్లో కనిపించడం లేదు.