ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం నగర మునిసిపాలిటీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇక్కడ అంతిమ పోరు మాత్రం వైసీపీ మరియు టీడీపీలకు మధ్యనే ఉండనుంది. ఇక్కడ టీడీపీ కి గతంతో పోలిస్తే కొంచెం బలం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కూడా వైసీపీ విజయ కేతనం ఎగరవేసింది. స్థానికంగా వైసీపీ కి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. గత ఎన్నికలలో వైసీపీ ఇక్కడ గెలిచిందంటే కారణం ఈ యువ ప్రభంజనమే. 2019 లో ఇక్కడ ఎమ్మెల్యే సీటు దళితులకు రిజర్వ్ అవ్వడంతో, వైసీపీ తరపున ఆర్థర్ అనే క్రైస్తవ మతస్తుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. ఈయన గెలుపుకు ప్రతిక్షణం ముందుండి అఖండ మెజారిటీతో ఆర్థర్ ను గెలిపించాడు. అయితే గత కొంత కాలంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు మరియు యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే వీరిద్దరూ మీడియా ముందు మాత్రం మా మధ్య ఎటువంటి వివాదాలు లేవని చెబుతున్నా...అసలు నిజం ఏమిటో స్థానిక నాయకులకు తెలుసు. ఈ మనస్పర్థలే ఇప్పుడు వైసీపీ ని బలహీనం చేయనున్నాయి అంటూ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల్లో జరగబోయే నగర పాలక ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే గతంలో ఒకటి రెండు సార్లు సీఎం జగన్ వీరిద్దరినీ మందలించి కలిపే ప్రయత్నం చేసినా ఫలించినట్లు లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. అయితే ఎన్నికల సందర్భంగా వీరిద్దరూ ఒకతాటిపైకి వచ్చి టీడీపీని ఓడిస్తారా..? లేదా ఇదే వివాదాలను కొనసాగిస్తూ వైసీపీ ఓటమికి కారణం అవుతారా తెలియాల్సి ఉంది.