మొత్తానికి ఆంద్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది.వాస్తవానికి ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.కాని కరోనా తగ్గి పరిస్థితులు అంతా కుదుటబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని
మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొదట కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో అన్ని నిబంధనలూ అమలు చేస్తూ ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించామని
మంత్రి సురేష్ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వాయిదా వేస్తున్నట్టు
మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం తెలిపడం జరిగింది.ఇప్పటికే విద్యార్థుల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి.
విద్యార్థుల ప్రాణాలు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు
మంత్రి తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సోమవారం హైకోర్టుకు తెలపనుంది ప్రభుత్వం.ఇక కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కేంద్రం తయారు చేసిందని, కానీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు లేవని ప్రభుత్వం తెలిపింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించారని, మరికొన్ని రాష్టాల్లో త్వరలో జరగాల్సి ఉందన్నారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. అయితే పరీక్షలు రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్ధులకు మంచి మార్కులతో గ్రేడ్లతో సర్టిఫికెట్లు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.