డెల్టా, ఆల్ఫా మినహా భారత్ లో కొత్తగా వేరియంట్లు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం 80వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించారు. జీన్ సీక్వెన్సింగ్ చేసినట్టు బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఆరు టీకాలు అందుబాటులో ఉండగా.. కొర్బివ్యాక్స్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నానల్ స్ర్పే త్వరలోనే స్వదేశీ మార్కెట్ లోకి అందుబాటులోకి రావొచ్చని ఆమె అంచనా వేశారు.

మనదేశంలో తయారైన వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ ఉందని.. 150 దేశాలు టీకా కావాలంటున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తెలంగాణ-గుడిమల్కాపూర్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన.. డిసెంబర్ నాటికి మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు వేస్తామన్నారు. ఆధార్ లేని వారికి.. ఇతర దేశాల వారికి మానవతా దృక్పథంతో టీకాలు వేస్తున్నామన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ పూర్తయ్యాకే విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు.

18ఏళ్లు పైబడిన వారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 44ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా 18నుండి 44ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. గ్రామ లేదా వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్లు ఇవ్వనుండగా.. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్ లు, వాలంటీర్లు అర్హులను వ్యాక్సిన్ కేంద్రాలకు తరలిస్తారు. అయితే రాష్ట్రంలో 18 నుండి 44ఏళ్ల వయసువారు 1.9కోట్ల మంది ఉన్నారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా నేటి నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహనాల ద్వారా.. పదిరోజుల పాటు అర్హులందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే అర్హులైన 70శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. మిగిలిన 30శాతం మందికి సైతం వ్యాక్సిన్ వేసేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 200వాహనాలు ఏర్పాటు చేశారు.

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురించి ఆలోచన కూడా చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మూడో దశ  ముప్పు రాదని.. అయినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  నేడు ఖైరతాబాద్ లో మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ను పరిశీలించారు. త్వరలో ఈ విధానం రాష్ట్రమంతటా చేపడుతామని ఆయన పేర్కొన్నారు.









 

మరింత సమాచారం తెలుసుకోండి: