రాజకీయాల్లో ఏ నేతకు అయినా ఓపిక చాలా అవసరం. ఓపిక ఉన్న వాళ్లు కష్టపడితే ఎప్పటకి అయినా పదవులు దక్కించుకుంటారు. ఏపీ సీఎం జగన్ వెన్నంటే ఉన్న ఓ నేతకు ఎట్టకేలకు ఏడేళ్ల నిరీక్షణ అనంతరం పదవి దక్కింది. ఆయనే మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే గా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత జగన్ చెంత చేరారు. జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్లు సైతం వదులకుని 2012 ఉప ఎన్నికలకు వెళ్లి మరీ బంపర్ మెజార్టీతో గెలిచారు. అలాంటి నేత 2014 ఎన్నికల్లో రాజంపేట లో ఓడిపోయారు.
విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అయితే జిల్లాలో వైసీపీ స్వీప్ చేసినా రాజంపేటలో ఆయన మాత్రమే ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒక పదవి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే రాజంపేటలో ఆయనపై గెలిచిన మేడా మల్లి ఖార్జున రెడ్డి వైసీపీలో చేరడంతో అమర్నాథ్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. అయితే ఆయన కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
అయితే ఇప్పుడు జగన్ ఆయన్ను కడప జిల్లా పరిషత్ చైర్మన్ ను చేశారు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి తొలి నుంచి జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగారు. ఆయన రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలిచారు. ఇప్పుడు యేడాది పాటు ఊరించి ఊరించి ఎట్టకేలకు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే జడ్పీ చైర్మన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన జడ్పీ చైర్మన్ గా ఎన్నిక కావడం నామమాత్రం కానుంది. ఇక జగన్ అన్ని జడ్పీ చైర్మన్ పదవులు కూడా ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే కట్టబెట్టారు.