వైస్ షర్మిల గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం అయిన నాటినుండి జగన్ అన్నకు షర్మిల ఓ తమ్ముడి కంటే ఎక్కువగా అండగా ఉందనే చెప్పకోవాలి. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె కీలక రోల్ పోషించింది. ఆ తరువాత జరిగే పరిణామాలు వలన ఆమె అన్నకు దూరమైంది. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలలో ఆమె ఓ పార్టీ పెట్టి అక్కడ తన ప్రభావాన్ని చూపించే ధైర్యం చేసినప్పటికీ అక్కడ ఆమె పాచిక పారక పోవడంతో ఇపుడు ఏపీలో త్వరలో జరగబోతున్న ఎలక్షన్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇక్కడ ఆమె కాంగ్రెస్ తరపున ఒక ప్రభావంతమైన నాయకురాలిగా మారింది అనడంలో సందేహమే లేదు. అవును, ఇపుడు ఇక్కడ ఆమె సొంత అన్నకే పక్కలో బల్లెంలాగా మారింది.

అయితే ఆమె అంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏమిటి? ఆమె వెనుక్కున్నది ఎవరు? ఆమె వ్యూహం ఏమిటి? అనే చర్చలు ఇపుడు మీడియాలో వాడివేడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అసలు షర్మిల వెనుక ఉన్నది ఎవరు? అనే మాట అందరి నోట వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ ను రాజకీయ ప్రత్యర్థులు కూడా అనలేని దారుణమైన మాటలను ఇపుడు షర్మిల బాహాటంగానే అనగలుగుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు బయటకు వినబడుతోంది. అవును, ఈ మాట స్వయంగా వైసిపి నేతలే అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం, ఏపీ రాజకీయాల వైపు రావడం, పీసీసీ పగ్గాలు అందుకోవడం వెనుక చంద్రబాబు వ్యూహాలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని గుసగుసలు వినబడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. కడప జిల్లా నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా కడప నడిబొడ్డులోనే అన్న పరువు గంగలో కలిపేస్తున్నారు. ప్రధానంగా బాబాయ్ హత్య కేసును హైలెట్ చేస్తూ అన్నపై విరుచుకుపడుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో విపక్ష నేతలే కడపలో విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేస్తారు. అటువంటిది షర్మిల నిర్భయంగా ఆరోపణలు చేస్తుండడం ఇపుడు విశ్లేషకులకు సైతం మతి పోతోంది. ఈ క్రమంలోనే ఆమె వెనుక బలమైన శక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అది చంద్రబాబుకు మించి ఉండొచ్చు అని కూడా అనుమానించేవాళ్ళు లేకపోలేదు. మరికొంతమంది అయితే బీజేపీ ఆజ్ఞతో పవన్ కళ్యాణ్ వెనక ఉండి నడిపిస్తున్నాడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ ప్రస్తుతం షర్మిల చరిష్మాకి ఏ డోఖా లేదనేది అయితే సుస్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: