కానీ, ప్రత్యర్థి పక్షం చేసిన విమర్శలపై జనాలు ఆలోచించుకునే అవకాశం టీడీపీ ఇవ్వడం లేదు. దీంతో జగన్ చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఎక్కువ కాలం నిలబడడం లేదు. ఎలానూ టీడీపీ తిప్పికొట్టింది కాబట్టి.. మేం ఎందుకు రియాక్ట్ కావాలని వారు అనుకుంటున్నారు. ఇ దేసమయంలో వైసీపీ అధినేత జగన్.. తనపై ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, జనసేనలు చేస్తున్న విమర్శలపై రియాక్ట్ కావడం లేదు. దుర్మార్గుడు అన్నా.. సైకో అన్నా.. ఆయన పట్టించుకోవడం లేదు.
పైగా తానే కొత్త కొత్త అంశాలతో విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీడీపీ, జనసేనలు వివరణ ఇస్తున్నాయి. కానీ, జగన్ మాత్రం తనపై చేస్తున్న సైకో.. దుర్మార్గుడు, అవినీతి పరుడు, ప్రజల రక్తం తాగుతున్నాడు.. వంటి అనేక విమర్శలను అసలు ఆయన పట్టించుకోవడం లేదు. అయితే.. వీటిపై ఆయన స్పందించకపోవడం వెనుక.. కారణం ఉందా? అంటే ఉందనే అంటున్నారు పరిశీలకులు. జగన్ తన ప్రత్యర్థుల విషయంలో చూపిస్తున్న ఓర్పు, సంయమనం వెనుక చాలా వ్యూహం ఉందని చెబుతు న్నారు.
తనపై చేసే విమర్శలకు జగన్ స్పందించడం మానేసిన తర్వాత.. ప్రజల్లో వీటిపై చర్చ ఎక్కువగా సాగుతోంది. టీడీపీ అయినా.. జనసేన అయినా చేస్తున్న విమర్శలపై జనాలే చర్చించుకుంటున్నారు. దీంతో జగన్పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని అనే వారు పెరుగుతున్నారు. తద్వారా.. ఆయనపై పరోక్షంగా సింపతీ పెరుగుతోంది. దీనికి తోడు తనపై ఇన్ని మాటలు అంటున్నా.. కనీసం ఆయన ఏమీ అనడం లేదనే చర్చ మహిళల్లోనూ జరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్లోనూ.. ఆఫీసుల్లోనూ ఇదే చర్చ సాగుతోంది. ఇది పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు ప్రమాద ఘంటికలు మోగిస్తుందని అంటున్నారు పరిశీలకులు. వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం తగ్గిస్తే.. బెటర్ అని చెబుతున్నారు.