ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయి విసిరిన కేసులో సతీష్ అలియాస్ సత్తి నిందితుడని తేల్చిన పోలీసులు ఏ1గా సతీష్ ను పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో సతీష్ జగన్ పై రాయి విసిరాడని పోలీసులు చెబుతుండగా రిమాండ్ రిపోర్ట్ లో ఏ2 ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఘటన జరిగి ఆరు రోజులైనా ఈ కేసు విషయంలో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో దుర్గారావును ఏ2గా చేరుస్తారా లేక మరో వ్యక్తిని ఏ2గా చేరుస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
పోలీసులు దుర్గారావును అనుమానితుడిగా అదుపులోకి తీసుకోగా రిమాండ్ రిపోర్ట్ లో అతని పేరు లేకపోవడంతో అతని పాత్ర ఉందో లేదో స్పష్టత లేదు. ఈ కేసులో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. దుర్గారావు కుటుంబ సభ్యులు మాత్రం అతని ఆచూకీ కోసం స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సతీష్ ఏ కారణంతో జగన్ పై దాడి చేశాడనే ప్రశ్నలకు సైతం రిమాండ్ రిపోర్ట్ లో సంతృప్తికరంగా సమాధానాలు లేవు.
 
మరోవైపు ఈ కేసుతో తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా తన పేరు వినిపిస్తోందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని తన పేరును ప్రస్తావించవద్దని ఆయన కోరుతున్నారు. కోర్టు సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించగా దుర్గారావు వెనుక ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
నిందితుడు సతీష్ రెండుసార్లు దాడికి ప్రయత్నించారని డాబా కొట్ల సెంటర్ లో జగన్ ప్రయాణిస్తున్న వాహనంపై నిందితుడు రాయి విసరగా ఆ రాయి తగలలేదని ఆ తర్వాత వివేకానంద స్కూల్ దగ్గరకు వచ్చి రాయి విసిరాడని తెలుస్తోంది. సతీష్ రాయితో దాడి చేయడాన్ని కొంతమంది గమనించి అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారని వారిని తప్పించుకుని సతీష్ పారిపోయాడని భోగట్టా. జగన్ పై దాడి కేసు ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: