తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జటప్రోలులో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ, 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అయ‌న ప్ర‌క‌టించ‌డ‌మే ఇందుకు కారణం. “ఇంకా పదేళ్లు ఈ పాలమూరు బిడ్డే సీఎం” అని ఆయన స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వెల్లివిరిసింది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, “2034 వరకూ సీఎం అని రేవంత్ ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం.


కాంగ్రెస్‌లో అధిష్టానం ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు” అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరింతగా బయటకు తెచ్చినట్లయ్యాయి. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విభిన్న వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న మాట నిజం. తాజాగా చేసిన ఈ ప్రకటనతో ఆయన పై విమర్శలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. జటప్రోలులో జరిగిన సభలో రేవంత్ తన టోన్‌ను షార్ప్‌గానే ఉంచారు. “పదేళ్లు పాలన నా చేతుల్లోనే ఉంటుంది. పాలమూరును అధికార కేంద్రంగా మార్చి రాష్ట్రాన్ని నడిపిస్తా” అని ఆయన చెప్పడం విశేషం.


ఇదే సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు జిల్లాకు ఏమీ చేయలేదని, కేసీఆర్ పాలన ప్రజలకు ఉపయోగపడలేదని ఆరోపించారు. కానీ.. రేవంత్ పదేళ్ల సీఎం  ప్రకటన పై పార్టీ లోపలే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ స్థాయి పార్టీ. ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలకు స్థానం ఉండదన్నది సీనియర్ నేతల అభిప్రాయం. కోమటిరెడ్డి వ్యాఖ్యల తో ఈ చర్చ మరింత ఉధృతం కావడం ఖాయం. ఇదంతా చూస్తుంటే.. రేవంత్ వ్యాఖ్యలు ఆయన పార్టీకి చీలిక తెచ్చేలా మారుతాయా ? లేక ఇది కేవలం ఓ ఆత్మవిశ్వాసపు ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న .


మరింత సమాచారం తెలుసుకోండి: