మంగళగిరి అనగానే ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేరు మారుమోగేది. వరుస విజయాలతో పాటు, అసెంబ్లీలోనూ, బయట కూడా ఆయన వైసీపీ గళాన్ని బలంగా వినిపించేవారు. కానీ, 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ నారా లోకేష్ పేరు వినిపిస్తున్నంతగా, ఒకప్పుడు చక్రం తిప్పిన ఆర్కే పేరు ఎక్కడా వినిపించడం లేదు. అసలు ఆర్కే ఏమయ్యారు ? ఆయన మౌనం వెనుక ఉన్న కారణాలేంటి ? అనేది ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.


రాజధానిపై పోరు.. ఒకప్పటి జోరు :
2014-19 మధ్య కాలంలో అమరావతి రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా ఆర్కే చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. రాజధాని భూముల విషయంలో రైతులతో కలిసి కోర్టు మెట్లు ఎక్కడం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు లేఖలు రాయడం వంటివి ఆయన్ని వార్తల్లో నిలిపాయి. 2019 ఎన్నికల్లో అప్పటి మంత్రి నారా లోకేష్‌ను ఓడించి, వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆర్కే అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, మళ్లీ కొద్ది రోజులకే వైసీపీ గూటికి చేరడం వంటి పరిణామాలు జరిగాయి.


అయితే, 2024 ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు, ప్రజలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన గతంలో నిర్వహించిన పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ప్రస్తుతం నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆర్కే సైలెంట్‌గా ఉండటం వెనుక ప్రధానంగా కేసుల భయం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అమరావతికి వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు, ప్రపంచ బ్యాంకుకు పంపిన ఈమెయిల్స్ వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది.


పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం కంటే మౌనంగా ఉండటమే మేలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా మంగళగిరిలో ఒక వెలుగు వెలిగిన ఆర్కే.. ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడా కనిపించకపోవడం, కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడం అటు అనుచరులను, ఇటు వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: