- చంద్రబాబు మరోసారి సీఎం అవ్వాల్సిందే
- బీజేపీ సపోర్ట్తో రాష్ట్రంలో అభివృద్ది ఉరుకులు పరుగులు
- ఒక్క ఛాన్స్ అన్న జగన్ 20 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లాడు
- సర్పంచ్ల సన్మాన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, మార్చి 22 : చంద్రబాబు మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధికి బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతుందని.. కూటమిలో మూడు పార్టీలు కలిసికట్టుగా ఐక్యంగా ఉంటేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలో వచ్చే నెలలో పదవీ వీరమణ చేస్తోన్న పార్టీ సానుభూతిపరులైన సర్పంచ్లకు మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసైనికులు ధైర్యంగా ముందుకొచ్చి నాటి ప్రభుత్వ అరాచకాలను ఎదురొడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి సేవలను మనం ఎప్పుడూ గుర్తుంచుకుని వారిని కలుపుకుని ముందుకు వెళ్లాలని టీడీపీ కేడర్కు సూచించారు. బీజేపీ సహకారంతోనే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని.. కూటమిలో మూడు పార్టీలను కలిసి ఐక్యంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.
మన పిల్లల భవిష్యత్తు కోసం అయినా.. రాష్ట్రం భవిష్యత్తు కోసం అయినా మరోసారి కూటమి ప్రభుత్వం తప్పక ఏర్పాటు కావాలని.. రాష్ట్రానికి మంచి నాయకత్వాన్ని మనం అందించాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకు వెళ్లాడని మంత్రి విమర్శించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేసే నా సెర్ప్ డిపార్ట్మెంట్కు గత ప్రభుత్వం కేవలం రు. 300 కోట్లు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బడ్జెట్ మూడు రెట్లకు పైగా పెంచి రు. 1000 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులు పూర్తిగా ఉపయోగిస్తే... వచ్చే యేడాది బడ్జెట్లో వీటిని మరింతగా పెంచుతామన్నారు. పేదరిక నిర్మూలనలో భాగమైన శాఖకే రు. 300 కోట్లు కేటాయించడం అంటే గత వైసీపీ ప్రభుత్వానికి పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలు, ప్రజల కోసం పని చేయలేదని.. వారి వ్యాపారాల కోసం, వారి వ్యక్తిగత అవసరాలే లక్ష్యంగా పాలన చేసిందన్నారు. ఈ విషయంలో వైసీపీలో ఉన్న నేతలకు కూడా తెలుసు అని.. కానీ వారు పార్టీలో ఉండి నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులుగా ఉన్న వారు కూడా ప్రభుత్వంతో పని చేయించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
మీరు ఎన్ని సమస్యలు తెస్తే.. అంత బాగా పని చేస్తాను...
మీరు ఎన్ని సమస్యలు నా దృష్టికి తెస్తే.. నేను అంత బాగా పనులు చేస్తానని.. మీరు ఎంత కష్టపడితే.. నేను కూడా అంతే కష్టపడతానని మంత్రి శ్రీనివాస్ సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలకు సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో నూటికి నూరుశాతం విజయాలు సాధించాలని.. గ్రామాల్లో పార్టీ పరంగా ఎలాంటి విబేధాలు లేకుండా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. స్థానికంగా మన పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటేనే.. అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఎవ్వరూ రెబల్స్గా పోటీ చేయకుండా.. పార్టీ నాయకులు అందరూ సమన్వయం చేసుకుని.. సర్దుకుని ముందుకు పోవాలన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో సర్పంచ్లుగా గెలిచిన చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సర్పంచ్లకు జరిగిన ఈ సన్మానం తెలుగుదేశం జెండా పట్టుకుని గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అని నేను గర్వంగా చెపుతున్నాన్నని మంత్రి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
అనంతరం మంత్రి పార్టీ సానుభూతిపరులైన సర్పంచ్లందరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు తమ ఐదేళ్ల పాలన అనుభవాలు, వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. ఈ కార్యక్రమం అంతా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగి, నాయకులు మరియు కార్యకర్తల మధ్య ఐక్యతను మరింత బలపరిచింది. కార్యక్రమంలో కొండపల్లి కొండలరావు, ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ కోరాడ కృష్ణ, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీథర్, నియోజకవర్గంలోని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్, గంట్యాడ శ్రీదేవి, రాపాక అచ్చెన్నాయుడు, కొండపల్లి భాస్కర్నాయుడు, స్వామి నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి