
ఈ దృశ్యం మారాలని ప్రతి నాయకుడూ చెప్పేవాడే..కానీ ఆచరణలో మాత్రం పట్టించుకునేవారే లేకపోయారు. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. ఆ దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి. పల్లెవాసి ఇంటి ముందుకు అన్ని సదుపాయాలు అందించే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. గ్రామ సచివాలయంలో దరఖాస్తు ఇస్తే సరి. వాలంటీరుకు చెబితే సరి.
ఇక పల్లెలు అంటే ఈ దేశానికి అన్నం పెట్టే కర్మాగారాలు.. పొలాల్లో పని చేసే రైతన్నే ఇక్కడ కార్మికుడు. కానీ.. ఈ రైతుకు సరైన సమాచారం ఉండదు.. గిట్టుబాటు ధర రాదు.. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ప్రతి గ్రామంలోనూ ఓ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసింది వైసీపీ సర్కారు. ఇక్కడ అన్ని రైతు సమస్యలకు పరిష్కారం లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పల్లెల్లో వైద్యం కోసం వైఎస్సార్ క్లినిక్ లకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
వీటితో పాటు ప్రభుత్వ బడులను జగన్ సర్కారు బలోపేతం చేస్తోంది. పట్నాల్లోని బడులకు తీసిపోకుండా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తోంది. బడికి వెళ్తే చాలు.. ఆ పిల్లల తండ్రులకు ప్రోత్సాహకాలు అమ్మఒడి రూపంలో అందిస్తోంది. ఇవే కాకుండా ఇంకా జగన్ ఎజెండాలో మరికొన్ని అంశాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఓ డిజిటల్ గ్రంధాలయం ఏర్పాటు చేయాలి.. ప్రతి ఊళ్లో ఓ ప్రీ ప్రైమరీ పాఠశాల ఉండాలి.. మండలానికో 108 వాహనం అందుబాటులో ఉండాలి. ప్రతి గ్రామ పీహెచ్సీకి అనుసంధానంగా 104 సౌకర్యం ఉండాలి. ఇలా ఇప్పుడు గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని స్వాగతించాల్సిందే.