ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మొదటి టెస్ట్ ఏకపక్షమైన ఫలితం వచ్చేలా కనబడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన 404 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయి ఇన్నింగ్స్ ను ముగించింది. ఇందులో పుజారా 90, అయ్యర్ 86 , పంత్ 46 మరియు అశ్విన్ 58 పగలు చేసి జట్టుకు ఆ మాత్రం స్కోర్ చేయడంలో సహాయం చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం మరియు మెహిదీ హాసన్ మిరాజ్ లు తలో నాలుగు వికెట్లు తీశారు. బదులుగా బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల దెబ్బకు తడబడుతోంది. ఈ స్కోర్ ను అందుకోవడం కాదు కదా కనీసం సగం స్కోర్ చేసినా బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొప్పే అనుకోవాలి.. అంతలా ఒక్కొక్కరు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు.

ముఖ్యంగా వీరికి సరైన మొదటి భాగస్వామ్యమే ఓపెనర్లు అందించలేదు అని చెప్పాలి. మొదటి ఓవర్ మొదటి బంతికే శాంటో ను డక్ అవుట్ చేసి  మొదటి వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. అప్పటి నుండి బంగ్లా ఇన్నింగ్స్ ఏ దశలోనూ కుదుటపడలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.. మరో ఓపెనర్ జాకీర్ హుస్సేన్ (20) ను కూడా సిరాజ్ అవుట్ చేశాడు. యాసిర్ అలీ (4) ని ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించగా కాసేపు కుదురుకున్నట్లే కనిపించిన లిటన్ దాస్ (24) ను అద్భుతమైన స్వింగ్ తో సిరాజ్ బౌల్డ్ చేశాడు.

మొదటి ఇన్నింగ్స్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (45) బ్యాట్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్ తో కలిసి కీలక సమయంలో మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా తాను వేసిన మొదటి ఓవర్ రెండవ బంతికే ప్రమాదకర బ్యాట్స్మన్ షకిబుల్ హాసన్ ను అవుట్ చేశాడు. దీనితో బంగ్లాదేశ్ సగం వికెట్లను కేవలం పరుగులకే కోల్పోయింది. ఇందులో తెలుగోడు మూడు వికెట్లతో కొట్టిన దెబ్బ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ లెక్క చూసుకుంటే వంద పరుగులకే బంగ్లా చాపచుట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: