వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు, మాఘ నవరాత్రులు అనే పేర్లతో సంవత్సరంలో నాలుగుసార్లు అమ్మవారి నవరాత్రులను ఉత్సవాలుగా నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ జరిగే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఇవి వసంత కాలంలో వస్తాయి. వీటినే శ్రీరామనవమి ఉత్సవాలు అని కూడా అంటారు. ఆషాఢ శుక్లపక్షంలో జరిపే నవరాత్రులను ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులు అంటారు. మాఘమాసంలో తొమ్మిది రూపాలలో మాఘ శుక్ల పక్షాన జరిపే నవరాత్రులను మాఘ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. ఈ మూడు నవరాత్రులను అన్ని ప్రాంతాల వారు నిర్వహించరు. కానీ శరత్‌ కాలంలో వచ్చే శరన్నవరాత్రులను దేశమంతటా ఘనంగా జరుపు తారు కాబట్టే ఈ నవరాత్రులకు అంత ప్రాముఖ్యం ఏర్పడింది.

దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా పదో రోజున విజయదశమిగా పాటిస్తున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గానవరాత్రుల పూజలోని అంతరార్థం. ఏటా ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. చివరి రోజునే దసరా, విజయదశమిగా జరుపుకుంటాం. అమ్మవారి జన్మ నక్షత్రం శ్రవణం. కాబట్టి శ్రవణా నక్షత్రం ఉన్నప్పుడే విజయదశమి పూజను చేస్తారు.

ఈ ఏడాది విజయదశమిని అక్టోబరు 8 మంగళవారం జరుపుకుంటున్నాం. వాస్తవానికి సోమవారం మధ్యాహ్నం దశమి ఘడియలు ప్రవేశించినా, అమ్మవారి జన్మ నక్షత్రం మాత్రం సోమవారం రాత్రికి వస్తుంది. కాబట్టి మంగళవారం ఉదయం నుంచి విజయదశమి జరుపుకోవాలి. దశమి ఘడియలు మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉంటాయి. ఉదయాన్నే పూజచేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఉదయం 8.21 నుంచి 9.09 వరకు దుర్మహూర్తం ఉందని, ఆ సమయంలో తప్పితే మధ్యాహ్నం 12.45 వరకు అమ్మవారిని పూజించవచ్చని అంటున్నారు. వర్జ్యం మధ్యాహ్నం 12.42 నుంచి 2.30 గంటల వరకు ఉందని తెలుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: