సాధారణంగా కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు.. శునకాలు మనుషుల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాయి. వాటి విశ్వాసం ఎంత గొప్పదో చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది. అందుకే శునకానికి ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. అంటే.. అవి అంతటి నమ్మకంగా ఉంటాయి. వీటికి మరో పేరు కూడా ఉంది. అదే కాలభైరవుడు. ఇవి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి కుక్కలకు ఓ దేవాలయం ఉందంటే నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజంమే! అది మన దేశంలోనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చన్నపట్న అనే నగరంలో అగ్రహార వలగెరెహల్లి అనే చిన్న గ్రామం ఉంటుంది.
ఈ గ్రామంలోనే శునక దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని వ్యాపారవేత్త రమేష్ 2010లో నిర్మించాడు. ఈ గ్రామం యొక్క ప్రధాన దేవత కెంపమ్మ ఆలయాన్ని కూడా ఈయనే నిర్మించాడు. అయితే మరి శునకాలకు ఎందుకు దేవాలయం కట్టారు..? అన్నదేగా మీ ప్రశ్న. గతంలో ఈ గ్రామానికి చెందిన రెండు కుక్కలు అదృశ్యం అయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత గ్రామ దేవత ఒకరి కలలోకి వచ్చి గ్రామస్తుల రక్షణ కోసం.. తన ఆలయానికి దగ్గరగా.. ఆ కనిపించకుండా పోయిన కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించమని కోరిందట.
అలా ఓ కల ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఆ రెండు శునకాల విగ్రహాలను ప్రతిష్టించారు. ఇవి ఎల్లప్పుడూ గ్రామస్తులను కాపాడుతూ దుష్ట శక్తులను దూరం చేస్తాయని గ్రామస్తులు నమ్మకం. ఇక అదృశ్యమైన ఆ రెండు కుక్కలను ఈ దేవాలయంలో ప్రతి రోజూ పూజిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గ్రామంలో భారీ పండుగ కూడా నిర్వహిస్తారు. అయితే చాలా మందికి ఇక్కడ ఉన్న శునక దేవాలయం గురించి తెలియదు. కానీ ఈ దేవాలయం ప్రతి ఏటా ఊహించని రీతిలో అనేక ప్రదేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించడం విశేషం.