తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగా కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు; సంతానం కలగదు, వ్యాపరంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది.

 

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది.

 

కొన్ని ఉదాహరణలు - ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

 

పచ్చని చెట్ల పై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం,  స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, 'పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో' అని పెద్దలంటారు.

 

భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూమలను ఆక్రమించుకుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనెముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మనదేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి.

 

ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి: