భారత్ జట్టుకి దూకుడు నేర్పించిన కెప్టెన్గా సౌరవ్ గంగూలీకి ఇది వరకే పేరుంది. ఇప్పుడు మళ్ళి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బీసీసీఐలో అత్యున్నత పదవి దక్కబోతోంది అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. గాడి తప్పిన బీ.సీ.సీ.ఐ కి సౌరవ్ గంగూలీ అయితేనే సరిగ్గా సరిపోతారు అని
క్రికెట్ సంఘాలు బలంగా విశ్వస్తున్నాయి అని పేర్కొన్నారు రాష్ట్ర
క్రికెట్ సంఘాల ప్రముఖులు.
ఈ నెల 10న సమావేశమైన పలు రాష్ట్రాల
క్రికెట్ సంఘాలు ఈ తుది నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తునాయి. అయితే, నిన్న ఢిల్లీలో అమిత్ షాతో గంగూలీ సమావేశం అవ్వటంతో ఆయన ఎంపిక ఏకగ్రీవమైనట్టు సమాచారం. అటు బీసీసీఐ కార్యదర్శిగా హోంశాఖ మంత్రి
అమిత్ షా కుమారుడు అయిన జై షా ఎన్నిక కానున్నారు. కోశాధికారిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి
అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధమాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఏమాత్రం పోటీ లేకుండా, కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య చాలా కాలంగా సుదీర్ఘ చర్చలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నెల 23న బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్స్ కి మాత్రం నేడే ఆఖరి తేదీ. తాజాగా ముంబయిలో చర్చలు సఫలం కావడంతో కొత్తగా బీసీసీఐ కమిటీ ఏర్పాటు కానుంది.
అసలు వివరాలలోకి వెళితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో అందరికంటే ముందు గంగూలీ నిలిచారని, ఇటీవలే జరిపిన హోంమంత్రి అమిత్ షాతో చర్చలు కూడా ఫలించాయని, మరియు మీటింగ్లో రాష్ట్ర
క్రికెట్ సంఘాల మద్దతు కూడా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకీ బలంగా ఉండటంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ, బోర్డు అధ్యక్షుడిగా 2020 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగగలరు అని...... ఇందుకు కొత్త నిబంధనలే కారణం అని చెప్తున్నారు. బీసీసీఐలో రెండు పర్యాయాలు ఏ పదవులైనా చేపట్టిన తర్వాత సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక, గంగూలీ సెప్టెంబర్ వరకే కొనసాగటం అవుతుంది అంటున్నారు.