
దేవుడు ఇచ్చిన ప్రాణాలకు కాస్తయినా విలువ ఇవ్వని మనిషి నేటి రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్న తీరు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని లేదంటే కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యామని మనస్థాపంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా చిన్న వయసులోనే విద్యార్థులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల కారణంగా ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నాయి అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయ్. ఈ ఫలితాల తర్వాత కొంతమంది విద్యార్థులు ఇలాగే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారిపోయింది. కృష్ణా జిల్లా తాడిగడప లోని ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫెయిల్ అయ్యావ్ అంటూ ప్రిన్సిపల్ సహా అధ్యాపకులు అందరూ కూడా తిట్టారు అని మనస్థాపం చెందిన వాణి అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా పోస్టుమార్టంకి తరలించారు. కాలేజీ తీరుపై అటు పేరెంట్స్ మండిపడుతున్నారు అని చెప్పాలి. వాణి డైరీలో కొన్ని పేజీలు చించి ఉండడంతో ప్రస్తుతం అనుమానాలు నెలకొన్నాయి.