చైనాలో ఇప్పటికి కరోనా వైరస్ కారణంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా., పది వేల మందికి పైగా కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ  వైరస్ కారణంగా చైనా లోని నగరాలన్నింటి లోను స్థానిక ప్రజలు బయటికి వచ్చి తిరగటం ఆపేసారు. ప్రధానంగా ఈ వైరస్‌ కు మూల కేంద్రమైన వుహాన్ నగరాన్ని దాదాపుగా మూసివేశారు. ఎప్పుడు రద్దీతో ఉండే నగరాల్లో కూడా జనం తిరగటం లేదంటే చైనాలో ఏ స్థాయిలో ఉందొో మనం యిట్టె అర్ధం చేసుకోవచ్చు. వీధులన్నీ  నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కరోనా భయం ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టే ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది.

 

వుహాన్‌ లోని ఒక వీధిలో ఓ వృద్ధుడు ఫుట్ పాత్‌ మీద చనిపోయి ఉండగా.. కరోనా భయంతో ఎవరూ అతణ్ని పట్టించుకోలేదు. చనిపోయిన వ్యక్తికి 60 ఏళ్లు ఉంటాయని భావిస్తుండగా.. అతడు ఎలా చనిపోయాడో తెలియలేదు. చనిపోయిన వ్యక్తి ఫేస్ కి మాస్క్ ధరించి, ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్‌ తో తెల్ల జుట్టుతో ఫుట్‌పాత్ మీద పడి ఉన్న అతణ్ని జనం పట్టించుకోలేదు. జర్నలిస్టులు శవాన్ని గమనించి ఫొటోలు తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

అక్కడికి కాసేపటి తర్వాత పూర్తి మాస్కులు, రక్షణ సూట్‌ ధరించిన పోలీసులు, మెడికల్ స్టాఫ్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే శవాన్ని బ్లూ బ్లాంకెట్‌లో చుట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. వైరస్ సోకే అవకాశం ఉందనే భయంతో అటుగా ఎవరూ రాకుండా అడ్డు ఏర్పాటు చేశారు. పోలీసులు పూర్తి జాగ్రత్తలు తీసుకొని రావడం, జనం ఎవరూ రోడ్డు పక్కన పడి ఉన్న శవాన్ని పట్టించుకోకపోవడాన్ని బట్టి.. కరోనా వైరస్ గురించి జనం ఏ స్థాయిలో భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

 

అతడు వైరస్ కారణంగానే చనిపోయి ఉంటాడని.. అందుకే అతడు దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదని ఓ మహిళ తెలిపారు. చాలా మంది చనిపోతున్నారు, పరిస్థితి భయానకంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ఇతర దేశాలకు విస్తరిస్తుండంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైరస్ ఉధృతిని అరికట్టడం కోసం నగరానికి విమానాల రాకపోకలను నిషేధించారు. రోడ్లను కూడా మూసివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: