ఉపప్రధాని టాట్యానా గోలికోవా ఈ విషయంపై మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే రష్యా లో మరణాల శాతం 20.3 పెరిగిందని అన్నారు. అందుకు కరోనా ప్రధాన కారణం. కొన్ని నెలలుగా ఈ తరహా కేసులు బాగా ఎక్కువగా నమోదు అవడం జరుగుతుంది. అదే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక స్థాయిలో ఈ మరణాలు చరిత్రలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఈ విజృంభణకు అసలు కారణం కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే టీకా వ్యవస్థ నెమ్మదించడం సహా ప్రజలు కనీస నిబంధనలు కూడా పాటించకపోవడం అని భావిస్తున్నారు.
అందుకే మరోసారి కఠిన నిబంధనలు సహా టీకా ను అనివార్యం చేశారు. అసలు టీకా తీసుకోకుండా బయటకు రానీయడం లేదు. 60 కానీ అంతకంటే ఎక్కువ వయసు వారు ఖచ్చితంగా టీకాలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి నాటికి అందరికి టీకా వేయడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందరికంటే ముందే టీకాను తెచ్చిన దేశం అయినప్పటికీ, అక్కడి పౌరులు తీసుకున్నది కేవలం 40 శాతం మాత్రమే. అందుకే ఈ ఉదృతి. తాజాగా దక్షిణాఫ్రికా నుండి స్వదేశానికి వచ్చిన ఇద్దరికీ కరోనా ఉందని తేలడంతో, వారి నమూనాలతో కొత్త వేరియంట్ ఉన్నది లేనిది పరీక్షలకు పంపించారు. అలాగే కొత్తవారు ఎవరైనా విదేశాల నుండి వస్తే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశారు. గడిచిన 24 గంటలలో రష్యా లో 32930 కేసులు బయటపడగా, 1217 మంది మరణించారు.