మారుతున్న జీవనశైలితో మానవుడు ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నాడు. మనిషికి ప్రశాంతమైన జీవనం కరువు అయ్యింది. ఇక ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం అయిపోయింది. ప్రతిదానికి స్మార్ట్ఫోనో లేదా కంప్యూటర్నో ఆశ్రయించకతప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు- ఇతర ప్రైవేటు ఉద్యోగులు కూడా అదే పనిగా సీట్లలో గంటల తరబడి కూర్చొని పనిచేయక తప్పని పరిస్థితి.
దీంతో మనుష్యులకు మానసిక శ్రమ ఎక్కువ అయ్యి... రోజు రోజుకు శారీరక శ్రమ తగ్గిపోతోంది. కంప్యూటర్ యుగం నేపథ్యంలో మానవులు గంటల తరబడి కంప్యూటర్ ముందుకు కూర్చొని పని చేస్తుండడంతో టైం తెలియకుండానే గడిచిపోతోంది. ఇదే ఇప్పుడు మనిషి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. 9 గంటలు మించి కూర్చొని పనిచేస్తే వారు మరణానికి దగ్గరవుతున్నట్టే అని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
నార్వే దేశానికి చెందిన ‘నార్వేజియన్ స్పోర్ట్స్ స్కూల్ పరిశోధకులు’ పరిశోధించి గుండె బద్దలయ్యే ఈ నిజాన్ని వెల్లడించారు. 18-64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో ఏకంగా 36383 మందిపై వీరు పరిశోధనలు చేశారు. వీరిలో ఎక్కువుగా 9 గంటల పాటు కూర్చొని పనిచేసిన వారు 2149మంది తమ సగటు జీవితకాలం కంటే తొందరగానే మరణించినట్టు వీరి అధ్యయనంలో తేలింది.
వీరు శారీరక శ్రమ చేయకపోవడంతో గుండె సంబంధిత, ఇతర వ్యాధులకు గురయ్యారు. అందుకే ప్రతీ మనిషి వారానికి కనీసం 75 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని.. లేదంటే మీ ప్రాణాలు ముందుగానే పోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.