దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలున్నారు. బాబాయ్ వెంకటేశ్ తెలుగు మార్కెట్ని ఫోకస్ చేస్తోంటే, అబ్బాయి రానా పాన్ ఇండియన్ మార్కెట్ కోసం వెతుకుతున్నాడు. తమిళ్, హిందీల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అన్న రూట్లోనే తమ్ముడు అభిరామ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. తేజ దర్శకత్వంలో హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఇక ఈ మూవీకి 'అహింస' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. సినిమా ఇండస్ట్రీలో చోటు దొరకడం చాలా కష్టం. అదే హీరోగా చేయాలంటే కొన్నేళ్లపాటు పోరాటం చేయాలి. కానీ ఇదంతా బయటవాళ్లకి మాత్రమే. తండ్రి సినిమాల్లో ఉంటే కొడుకుకి ఈజీగా ఎంట్రీ దొరకుతుంది. ఫస్ట్ మూవీతోనే లార్జ్ స్కేల్లో హీరోగా లాంచ్ కావొచ్చు. అయితే వారసత్వం కార్డ్తో సినిమాల్లోకి వచ్చినా, కెరీర్ సాగాలంటే కచ్చితంగా సూపర్ హిట్స్ ఉండాలి.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు అవుతోంది. ఈ లాంగ్ పీరియడ్లో మాస్ హీరోగా ఎదగాలని చాలా కష్టపడుతున్నాడు. అయితే ఈ మాస్ ఇమేజ్ మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అయితే తమ్ముడు మాత్రం మాస్ ఆశలతో కాకుండా సింపుల్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నాడు. 'స్వాతిముత్యం' అనే సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు బెల్లంకొండ గణేష్. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య దర్శకత్వంలో 'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమాతో హీరోగా లాంచ్ అవుతాడనే టాక్ వస్తోంది. 'వర్షం'తో ప్రభాస్కి క్రేజీ హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ ఇంటి నుంచి మరో హీరో లాంచ్ అవుతున్నాడు. ఇప్పటికే శోభన్ పెద్ద కొడుకు సంతోష్ శోభన్ హీరోగా రాణిస్తున్నాడు. 'పేపర్బాయ్, ఏక్ మిని కథ' లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక శోభన్ చిన్న కొడుకు.. 'బేకర్ అండ్ బ్యూటీ, త్రీ రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' లాంటి వెబ్ సీరస్లతో ఆకట్టుకున్న సంగీత్ శోభన్ కూడా ఈ ఏడాది వెండితెరపైకి వస్తున్నాడని, హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.