'మా'లో శాశ్వత సభ్యత్వం, ఓటు హక్కుకు సంబంధించి ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్షుడు మంచు విష్ణు. అయితే వీటిపై మరోసారి వివరణ ఇచ్చారు.ఏమన్నారంటే..

మంచు విష్ణు.. మా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించారు. 'మా'లో శాశ్వత సభ్యత్వం, ఓటు హక్కుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా 'మా' విషయంలో మీడియా ముందుకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, విమర్శలు చేసినా, సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా క్రమశిక్షణ చర్యల కింది వారి సభ్యత్వం రద్దు చేయబడుతుందని అన్నారు. అయితే మళ్లీ ఈ విషయాలపై వివరణ ఇచ్చారు.

ఎవరైనా మా గురించి ఆఫీస్ బేరర్స్ గురించి వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడచ్చు గానీ.. 'మా' కుటుంబం గురించి, కళామ్మతల్లి గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వెంటనే సభ్యత్వం నుంచి తీసేస్తాం. ఐదేళ్ల లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌ ఉంటేనే ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడు 900 మంది సభ్యులు ఉన్నారు. నా పదవీ కాలం పూర్తయ్యేలోపుఇంకా 300 మంది చేరుతారు. అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం. కానీ, ఓటు మాత్రం ఐదేళ్ల తర్వాతే వస్తుంది. మీ ఇంట్లో గొడవ జరిగితే పెద్దలకు చెప్తారా? లేక రోడ్డు మీదకు వచ్చి మీడియా ముందు గొడవ చేస్తారా? ఇంట్లో సమస్య ఏదైనా ఉండి.. అది తీరనప్పుడు మీ పెద్దల వద్దకు వెళ్తారు. మీడియా ముందు కావాలని పబ్లిసిటీ కోసం గోల చేయడం మంచిది కాదు కదా.. అందుకే ఇండస్ట్రీలో పెద్దలను డీఆర్సీ కమిటీలో పెట్టాం. నాన్న, బాలకృష్ణ, గిరిబాబు, శివకృష్ణ, జయప్రద, అన్నపూర్ణ.. మా నిర్ణయం కరెక్ట్‌ కాదని అన్నప్పుడు మేము వాళ్లు చెప్పిందే వింటాం. నేను 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. మేమంతా ఒక కుటుంబం. చేతికి ఉన్న ఐదువేళ్లు ఎలా అయితే ఒకేలా ఉండవు, ఒక కుటుంబంలో అందరూ సక్రమంగా ఉండరు. తప్పుదారి ఎంచుకున్న వారికి హెచ్చరికగా రూల్స్ మార్చాం" అని మంచు విష్ణు పేర్కొన్నారు.
అంతకుముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాశ్వత సభ్యతం, ఓటు హక్కు గురించి ఈ విధంగా మాట్లాడారు మంచు విష్ణు. " 'మా'లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. 5 నిమిషాలైనా సినిమాలో డైలాగు చెప్పిన వాళ్లకే అసోసియేట్‌ సభ్యత్వం. అసోసియేట్‌ సభ్యులకు 'మా'లో ఓటు హక్కు లేదు" అని విష్ణు తెలిపారు.
"2021 అక్టోబరు 13న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నా. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా పోటాపోటీగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తి చూపారు. నేను 'మా'కు మాత్రమే కాదు ప్రేక్షకులకూ జవాబుదారిని. మేం చేసిన వాగ్దానాల్లో 90శాతం పూర్తయ్యాయి. 'మా'లో నటులుకాని సభ్యులూ ఉన్నారు. సభ్యత్వం విషయంలో కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు రెండు సినిమాల్లో నటించి, ఆ చిత్రాలు విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. క్యారక్టర్‌ ఆర్టిస్టులు కనీసం పది సినిమాల్లోనైనా నటించి ఉండాలి. ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించాలి. అసోసియేట్‌ సభ్యులకు 'మా'లో ఓటు హక్కు లేదు. సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటింపజేయాలని నిర్మాతలకు చెప్పాం. నిర్మాత మండలి.. 'మా' సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. 'మా'కు వ్యతిరేకంగా నటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే 'మా' ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. 'మా' భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించా. ఫిల్మ్‌నగర్‌ సమీపంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ప్రస్తుతమున్న ఫిల్మ్‌ ఛాంబర్‌ భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తా. చాలామంది సభ్యులు రెండోదానికే ఆమోదం తెలిపారు"

"నటులందరికీ అవకాశం కల్పించాలనే అంశంపై ఓ పుస్తకాన్ని రూపొందించాం. దాన్ని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌తోపాటు నిర్మాతలందరికీ ఇచ్చాం. దీని ద్వారా ఇప్పటికే పది మందికి అవకాశాలు వచ్చాయి. మొబైల్‌ యాప్‌ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి తర్వాత అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ యాప్‌తో ఏ నిర్మాణ సంస్థలో ఏ చిత్రం తెరకెక్కబోతుంది? ఏ సినిమా చర్చల దశలో ఉంది? తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భారత చలన చిత్ర పరిశ్రమలోని ఏ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లోనూ ఇలాంటి విధానం లేదు. తొలిసారి ఇక్కడ ప్రారంభిస్తున్నాం. 'మా'.. మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. పద్మశ్రీ సునీత కృష్ణన్‌ గారిని అడ్వయిజర్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేశాం. 'మా' శాశ్వత సభ్యత్వం ఉన్నవారికే ఆరోగ్య బీమా. 'మా' సభ్యులు కాని సుమారు ఆరుగురికి పింఛను రద్దు చేశాం. వారిలో ఓ నటుడి కూతురు ఉంది. ఆ నటుడు చనిపోయిన తర్వాత ఆయన పింఛను ఆమెకు వస్తుండటంతో 'మా' తరఫున క్యాన్సిల్‌ చేసి, నేను వ్యక్తిగతంగా ఇస్తున్నా. 60 ఏళ్లు దాటినవారు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వారికే పెన్షన్‌ ఇస్తున్నాం" అని మంచు విష్ణు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: