మన సినిమాలకు జపాన్‌లోనూ మంచి గిరాకీ ఉంది. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్‌' అక్కడ విడుదలై ఆకట్టుకుంటోంది.తాజాగా మరో చిత్రం జపనీయుల్ని అలరించనుంది. విజయ్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన 'మాస్టర్‌' చిత్రం జపాన్‌లో 'సెన్‌సేయి' పేరుతో నవంబరు 18న విడుదల కానుంది. లోకేష్‌ కనగరాజ్‌ 'ఖైదీ' కూడా గతంలో జపాన్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. సాధారణంగా తమిళ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణే ఉంటుంది. రజనీకాంత్‌ 'ముత్తు' అక్కడ విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భయపెడుతూనే నవ్విస్తున్న కాజల్‌మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న కాజల్‌ ఈ మధ్యే తిరిగి సినిమాలతో బిజీ అయింది. తాజాగా ఆమె నటిస్తున్న తమిళ చిత్రం 'గోస్టీ'. హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో కాజల్‌ పోలీస్‌ అధికారిగా నటించింది. ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క భయపెట్టేలా ఆమె పాత్ర సాగుతుంది. ఇందులో యోగిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఊర్వశి, రాధిక, సురేష్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబరులోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో పక్క కమల్‌హాసన్‌ కథానాయకుడిగా వస్తోన్న 'ఇండియన్‌ 2' సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటుంది.

సుధీర్‌బాబు చిత్రం 'హరోం హర'

సుధీర్‌బాబు కథానాయకుడిగా జ్ఞాన సాగర్‌ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దైవిక కథాంశంతో ఈ చిత్రం రానుందని చిత్రబృందం ఇంతకుముందే చెప్పింది. తాజాగా ఈ సినిమా పేరుని 'హరోం హర'గా ఖరారు చేస్తూ ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. 'ది రివోల్ట్‌' అనేది ఉపశీర్షికగా పెట్టారు. 'ఇక చెప్పేదేం లేదు సేసేదే అంటూ ఈ టైటిల్‌ వీడియోలో సుధీర్‌ చెప్పిన సంభాషణ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ను బట్టి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇతివృత్తంతో సాగే కథని అర్థమవుతోంది. 1989నాటి కుప్పం నేపథ్యంలో కూడా కథ సాగుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పనులు సోమవారం నుంచి లాంఛనంగా మొదలయ్యాయి.

'హిట్‌' ప్రపంచం పెద్దది కానుందిహిట్‌'తో హిట్‌ అందుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు శైలేష్‌ కొలను. ఇప్పుడు ఆయన నుంచి వస్తోన్న మరో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ 'హిట్‌: ది సెకండ్‌ కేస్‌'. ఇందులో అడివి శేష్‌ కథానాయకుకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నాని, ప్రశాంతి నిర్మించారు. తాజాగా 'హిట్‌ వెర్సె' అనే పేరుతో ఓ వీడియోని శైలేష్‌ కొలను విడుదల చేశారు. అందులో అడివిశేష్‌ పాత్ర తీరుతెన్నుల గురించి చూపించారు. హిట్‌ ప్రపంచం ఇంకా పెద్దది కానుందని తెలియజేశారు శైలేష్‌. ఈ సినిమా టీజర్‌ను నవంబరు 3న విడుదల చేయనున్నారు. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అర్థంకాని అమ్మాయిలునరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'అమ్మాయిలు అర్థంకారు'. అల్లం శ్రీకాంత్‌, ప్రశాంత్‌, కమల్‌, మీరావలి, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''నాలుగు జంటల ప్రేమ కథలో ఏర్పడే మలుపులు, భావోద్వేగాలతో ఈ సినిమా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది''అన్నారు.

బంధాలు ఎలా ఉండాలి!

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్న ప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా 'ఓ తండ్రి తీర్పు'. ప్రతాప్‌, శ్రీరామ్‌, అనురాధ, మంజుల తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతాప్‌ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ దత్తి నిర్మాత. సోమవారం ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహర్తపు సన్నివేశానికి నిర్మాత దామెదర్‌ ప్రసాద్‌ క్లాప్‌నివ్వగా, సంగీత దర్శకుడు కోటి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''పిల్లల మధ్య బంధాలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజెప్పే సందేశాత్మక చిత్రమిది''అన్నారు.

సినిమా చూస్తే ప్రేమలో పడతారుఅశోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం'. అపర్ణాబాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌, రీతూ వర్మ కథానాయికలుగా నటిస్తున్న ఆర్‌.ఎ.కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ బ్యానర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. నవంబరు 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది''అన్నారు. ''ఈ సినిమా చూశాకా మీరూ ప్రేమలో పడతారు. అంతలా ఆకట్టుకుంటుంది''అన్నారు దర్శకుడు.

అంతా అమెరికాలోనే

వాసుకీ, మయూఖి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మయూఖి'. ఏఎల్‌ నితిన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నందకుమార్‌, డి.టెరెన్స్‌ సంయుక్తంగా నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పోస్టర్‌ను దర్శకుడు విమల్‌ కృష్ణ, రచయిత డార్లింగ్‌ స్వామి ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ''మేన కోడలి కోసం మేనమామ చేసే సాహసాల నేపథ్యంలో సాగే చిత్రమిది. చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది'' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: