మలయాళ బిగ్బాస్ రియాలిటీ షో ఎన్నో విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న చివరికి సంచలనాలను క్రియేట్ చేసింది. బిగ్బాస్ నిర్వాహకులు తొలి సీజన్ విజయవంతం కావడంతో రెండో సీజన్ను పట్టాలెక్కించారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా ఆదివారం రెండో సీజన్ ఘనంగా ప్రారంభమైంది.
ఇందులో పాల్గొననున్న సెలబ్రిటీలను నెటిజన్లు అప్పుడే ఫాలో అవడం మొదలుపెట్టారు. అయితే బిగ్బాస్ యాజమాన్యం మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్ కుమార్ను సెలక్ట్ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? రంజిత్ కుమార్పై ఎందుకు వ్యతిరేకత ఉందో తెలుసుకుందాం..
రంజిత్ కుమార్ కాలేజీ ప్రొఫెసర్గా పని చేసారు ,ఆయన ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్ ధరించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభా ప్రాంగణం నుంచి అక్కడి విద్యార్థులు నిరసనగా వెళ్లిపోయారు. ఇలా 2013లో తొలిసారిగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఓ టీవీ షోలో రంజిత్ కుమార్ అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్ సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు.
ఇక రంజిత్ మరోసారి మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే ఈ వివాదాస్పద వక్త ప్రాంతీయ భాషలో పలు పుస్తకాలను కూడా రచించారు. ఏదైతేనేం.. టీవీ షో కు ప్రాణవాయువు టీఆర్పీ. టీఆర్పీ రావాలంటే వినోదం ఒక్కటే సరిపోదు బిగ్బాస్ వంటి కార్యక్రమాలకు, వివాదాలు, గొడవలు.. అన్నీ కలగలసి ఉండాలి. అందుకనే బిగ్బాస్ యాజమాన్యం రంజిత్ కుమార్ను ఏరికోరి తీసుకుందని స్పష్టమవుతోంది. మరి బిగ్బాస్ హౌస్ లోపలికి వెళ్లాక సంయమనం పాటిస్తాడో లేదా మళ్లీ నోరుజారుతారో చూడాలి!