గత కొన్ని సంవత్సరాల నుండి మెగా ఫ్యామిలీలో గ్రూపులు ఉన్నాయని భీభత్సమైన ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక ఫంక్షన్ లో బన్నీ చేసిన వ్యాఖ్యల వలన పవన్ - బన్నీ మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. గతంలో పవన్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో పవన్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వైరం తగ్గింది. 
 
కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చరణ్ బన్నీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి అల వైకుంఠపురములో సినిమా కారణం కావడం గమనార్హం. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు కూడా దక్కాయి. 
 
సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీయార్, శర్వానంద్ అల వైకుంఠపురములో సినిమాను, అల్లు అర్జున్ నటనను ప్రశంసించారు. కానీ అల వైకుంఠపురములో సినిమా విడుదలైన తరువాత రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అల వైకుంఠపురములో సినిమా విడుదలకు ముందు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టిన రామ్ చరణ్ ఆ తరువాత సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనప్పటికీ సినిమా గురించి స్పందించలేదు. 
 
అల వైకుంఠపురములో సినిమా విషయంలో స్పందించని చరణ్ శర్వానంద్ జాను సినిమాను మాత్రం ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ సినిమా విషయంలో స్పందన వ్యక్తం చేయకుండా జాను సినిమా గురించి చరణ్ పోస్ట్ పెట్టడంపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అల వైకుంఠపురములో విజయోత్సవాల్లో కూడా మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ కనిపించలేదు. మరి సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ గురించి అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: