కలుసుకోవాలని మూవీ తో కథా రచయితగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన వక్కంతం వంశీ, అంతకముందు దాసరి నారాయణ రావు తీసిన కల్యాణ ప్రాప్తిరస్తు మూవీలో హీరోగా యాక్ట్ చేసారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక రచయితగా అడుగుపెట్టిన కలుసుకోవాలని మూవీ ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఉదయ్ కిరణ్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాలో గజాల, ప్రత్యూష కథానాయికలుగా యాక్ట్ చేశారు.

ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అశోక్, అలానే మహేష్ నటించిన అతిధి సినిమాలకు కథా రచన చేసిన వంశీ, ఆ మూవీస్ తో ఫ్లాప్స్ ఎదుర్కోక తప్పలేదు. అయితే ఆపై రవితేజ తో సురేందర్ రెడ్డి తీసిన కిక్ మూవీ సూపర్ హిట్ కొట్టి వంశీ కి పెద్ద బ్రేక్ ని అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా పలు సినిమాలకు కథా రచన చేసి మంచి విజయూలు అందుకున్న వక్కంతం వంశీ, 2018 లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు. అయితే తొలి సినిమా ఆయనకు ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వలేదు.

ఇక అప్పటి నుండి మరొక మంచి సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న వంశీ, ఇటీవల యువ నటుడు నితిన్ కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని, అది ఎంతో నచ్చిన నితిన్ వీలైనంత త్వరగా దానిని పట్టాలెక్కిద్దాం అంటూ మాట ఇచ్చారని సమాచారం. ఠాగూర్ మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా యాక్షన్ తో కూడిన పక్కా కమర్షియల్ జానర్ లో రూపొందనుందని, నా పేరు సూర్య మాదిరిగా కాకుండా తప్పకుండా ఈ మూవీ సక్సెస్ కొడుతుందని అంటున్నారు. మరి తన తదుపరి సినిమాతో వంశీ దర్శకుడిగా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి. కాగా త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: