భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడమనేది ఒక ప్రత్యేకమైన అనుభవమని రాజధాని ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త అతుల్ కేశప్ చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు అత్యంత ఉత్తమమైన ఉద్యోగ అవకాశాలను కూడా దక్కించుకోవచ్చని ఆయనన్నారు. మన దేశ విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వెల్లడించారు.
కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించడంతో దాదాపు రెండు నెలల పాటు వీసా జారీ పక్రియలో జాప్యం జరిగింది. ఈ సమయంలో వీసా ఇంటర్వ్యూ ప్రక్రియను వాయిదా వేసారు. ఈ ఏడాది మేలో స్టార్ట్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ ప్రక్రియ జులైలో ప్రారంభించాల్సి వచ్చిందని అతుల్ కేశప్ చెప్పుకొచ్చారు. భారతీయ విద్యార్థులకు ఓ సెమిస్టర్ సమయం వృధా కాకుండా ఉండేందుకే సాధ్యమైనంత త్వరగా వీసాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
యూఎస్ విదేశాంగ అధికారులు వీసాల ప్రక్రియను చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నారని అందుకు వారికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. వారి కృషి వల్లే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేయగలిగామని చెప్పారు. దాంతో ఇంకా వీసాలు జారీ కానీ విద్యార్థులు తమకు త్వరగా వీసాలు జారీ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీసాలు పొందిన భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.