అందుకే.. నూకలకు రూ.వెయ్యి కోట్లు పరిహారంగా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే సమస్యే ఉండదని ఈటల రాజేందర్ చెబుతున్నారు. కేవలం వెయ్యి కోట్లు డబ్బూ భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఆ విషయాన్ని కేంద్రానికి చెప్పాలని సూచిస్తున్నారు ఈటల. పంజాబ్లో రెండో పంట వరి కాదు గోధుమలు పండిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించాలని చెబుతున్నారు. తెలంగాణలో ధాన్యం కోనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలని ఈటల కామెంట్ చేశారు.
కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయంపై కేంద్రాన్నే నిందిస్తున్నారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని నిందిస్తున్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పదేపదే అన్నదాతలను అవమానించేలా మాట్లాడుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్రావు కూడా మండిపడుతున్నారు. ఎప్పుడు చూసినా పీయూష్ గోయల్ బెదిరింపు ధోరణి, అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పీయూష్ గోయల్ బేషరతుగా ఆయన రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని హరీశ్ రావు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పురోగతిని చూసి కేంద్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటోందన్న హరీశ్ రావు.. రైతులను అవమానిస్తే సహించేది లేదంటున్నారు. అవసరమైతే నూకలు తినైనా.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని శపథం చేస్తున్నారు.