తెలంగాణలో టిడిపి అనే పదం కూడా విన పడకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. టిడిపిని పూర్తిగా నాశనం చేసే బాధ్యత కెసిఆర్ తీసుకుంటే... ఇప్పుడు అక్కడక్కడ మిగిలిపోయిన టిడిపి నేతలను కూడా ఆ పార్టీలో లేకుండా చేసి తెలంగాణ గడ్డపై టిడిపి అన్న పదం వినపడకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఒకప్పటి టిడిపి నేత, ప్రస్తుత బిజెపి నేత అయిన గరికిపాటి మోహనరావు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న టిడిపి తరఫున రాజ్యసభకు ఎంపికై... తాజాగా బిజెపిలో విలీనం అయినా నేతల్లో ఆయన కూడా ఉన్నారు.
తెలంగాణలో కాస్తోకూస్తో నుండి తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన నేతలందరినీ ఆయన బీజేపీ గూటికి తీసుకు వెళ్ళిపోతున్నారు. ఆదివారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి.నడ్డా హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా తెలంగాణలోని ఏకంగా 17 జిల్లాలకు సంబంధించిన కీలక నేతలు అందరూ బిజెపి గూటికి చేసుకుంటున్నారు. టిడిపి నాయకుల మూకుమ్మడి చేరిక నేపథ్యంలో బిజెపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి ఏదో ఒక కీలక టీడీపీ నేత ఈ సభ ద్వారా బీజేపీలో చేరిపోతున్నారు. మొత్తం 20 వేల మందిని నేతలను బీజేపీ టార్గెట్ చేసి మరీ పార్టీలోకి తీసుకుంటోందని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎక్కువ చేరికలున్నాయి. నల్లగొండ నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభరాణి, పాల్వాయి రజనీ, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరావు, అంజయ్య యాదవ్ లాంటి నేతలు చేరనున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఈగ మల్లేశం, బొట్ల శ్రీనివాస్, అశోక్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎర్ర శేఖర్, జయశ్రీలు తదితరులు ఉన్నారు.
ఇక రంగారెడ్డి నుంచి సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణలు, ఖమ్మం జిల్లా నుంచి కోనేరు చిన్ని, మెదక్ జిల్లా నుంచి శ్రీకాంత్ గౌడ్ , మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డిలు బీజేపీలో చేరబోతున్నారు. మహాబూబ్ నగర్ కు చెందిన సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డిలు బీజేపీలో చేరాలని భావిస్తున్నా.. డీకే అరుణ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాంతో వీరి చేరికకు స్వల్ప బ్రేక్ పడినట్లయ్యింది.
ఈ మూకుమ్మడి చేరికల వ్యవహారం అంతా గరికపాడే తెరవెనక ఉండి నడిపిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆయన ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ భారీ చేరికలతో పాటు ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిలో పడాలన్నదే గరికపాటి ప్లాన్గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీ అనే పదం కూడా తెలంగాణలో వినపడకుండా చేస్తున్నారు.