ఆమె ఓ ఎమ్మెల్యే.. అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే.. అయితే మాకేంటి.. మాకు మాత్రం ఆమె ఓ దళిత స్త్రీ.. ఆమె తాకితే మేమే మైలపడతాం.. ఇక దేవుడి సంగతి వేరే చెప్పాలా..అన్నట్టుగా ప్రవర్తించారు కొందరు నాయకులు. ఇదేదో మారుమూల జరిగిన సంఘటన కాదు..రాజధాని నడిబొడ్డున జరిగిన దారుణం.


తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దారుణంగా అవమానించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.


టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. ఈ ఘటనపై శ్రీదేవి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. దేవుడి వద్దకు వెళ్తే మైల పడతారనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అంటరానితనాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం నేరమని చెప్పారు. మహిళా దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నేతల వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: