ఏపీలో ప్రతిపక్ష టీడీపీలో పదవుల రచ్చ మొదలైంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన పార్టీ కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఇద్దరూ పార్టీని వీడారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఇప్పటికే చాలా మంది నియోజకవర్గాల ఇన్చార్జ్లు, మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరమవుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నియోజకవర్గాల ఇన్చార్జ్లను భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ వంగలపూడి అనితను తిరిగి నియమించారు. ఆమె గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి పాయకరావుపేట ఇన్చార్జ్ అయ్యారు. ఇక గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్గా మాకినేని పెదరత్తయ్యను నియమించారు. అక్కడ గత ఎన్నికలు (2014లో) గెలిచిన రావెల కిషోర్ బాబు పార్టీ మారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అక్కడ గతేడాది ఎన్నికల్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు అక్కడ పార్టీ శ్రేణులను సమన్వయం చేసే క్రమంలో చంద్రబాబు మాజీ మంత్రి అయిన మాకినేని రత్తయ్యకు పగ్గాలు ఇచ్చారు. ఇదే అక్కడ హీట్ రాజేసింది. ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ వర్గానికి చెందిన వ్యక్తికి.. అందులోనూ ఫేడవుట్ అయిన కురు వృద్ధుడికి బాధ్యతలు ఎలా ? ఇస్తారని అక్కడ నేతలు మండి పడుతున్నారు.
జనాలు మర్చిపోయిన నేతలకు పదవులు ఎలా ? ఇస్తారంటూ అక్కడ నేతలు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే తాము చంద్రబాబుతోనే తాడోపేడో తేల్చుకుంటామని కూడా వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో ? చూడాలి.