దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత్‌లో కరోనా వైరస్‌ సామూహిక వ్యాప్తి ప్రారంభమయిందా..? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. దేశంలో విదేశాలకు వెళ్లని.... ఎటువంటి ప్రయాణ చరిత్ర లేని... కరోనా పాజిటివ్ వ్యక్తులతో సంబంధం లేని 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారికి కరోనా ఎలా సోకిందో అర్థం కాక కేంద్రంలో ఆందోళన మొదలైంది. 
 
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) దేశంలో కరోనా వ్యాప్తిపై సర్వే చేయగా ఆ సర్వే ఫలితాలు కేంద్రాన్ని తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఐసీఎంఆర్‌ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో బాధ పడేవారిని ఎంపిక చేసి కరోనా పరీక్షలు చేసింది. వీరిలో 104 మంది కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 40 మందికి కరోనా ఎలా సోకిందో ఎవరికీ అర్థం కావడం లేదు. 
 
ఐసీఎంఆర్‌ 52 జిల్లాల్లో సర్వే నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించింది. మెడికల్ జర్నల్ లో వెల్లడైన ఈ సర్వే ఫలితాల్లో 50 – 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు త్వరగా కరోనా భారీన పడుతున్నారని తేలింది. తీవ్రమైన శ్వాస కోశ సమస్యలతో బాధపడే రోగులకు మార్చి నెల రెండవ వారం వరకు కరోనా అసలు సోకలేదు. కానీ ఏప్రిల్ 2 నాటికి వీరిలో 2.6 శాతం మంది కరోనా భారీన పడ్డారు. 
 
ఎలాంటి లింకులు లేకుండా కరోనా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు కేంద్రాన్ని కోరుతున్నారు. ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరామ్‌ భార్గవ్‌ దేశంలో సమూహ వ్యాప్తికి ఇది సంకేతమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరిహద్దు భద్రతాదళాన్ని పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర చొరబాట్లను అడ్డుకోవడానికి మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అమిత్‌ షా వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష జరిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: