ప్రదానమంత్రి నరేంద్రమోదీ లాక్డౌన్ మరో 21 రోజుల పాటు పొడిగించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కొన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు మరో 21 రోజులపాటు మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. భారత దేశ ప్రజలందరూ మరో 19 రోజుల పాటు ఎక్కడ ఉన్న వారు అక్కడ సురక్షితంగా ఉంటే పూర్తిగా కరోనాను తరిమి కొట్టవచ్చునని మోడీ తెలిపారు. నేడు దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే బాబా సాహెబ్ అంబేద్కర్ కు మనం ఇచ్చే గొప్ప నివాళి అని వ్యాఖ్యానించారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ సాదాసీదాగా పండుగలు జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. మన దేశంలో ఐదు వందల కేసులు ఉన్నప్పుడే లాక్డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నామని... ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని ఆపామని చెప్పారు. ఈ మహమ్మారి విషయంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేసి ఉండకపోతే పరిస్థితులు మరింత భయానకంగా ఉండేవని మోడీ తెలిపారు. నేడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి చూస్తే మనం ఎంతో సేఫ్లో ఉన్నామన్నది తెలుస్తోందని... అందుకే ఈరోజు ప్రపంచ దేశాలు అన్ని భారత్ వైపు చూస్తున్నాయని మోడీ తెలిపారు.