తెలుగుదేశం పార్టీకి మహానాడు ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఏడాదికి నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో ఉన్న అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. ఈ మహానాడులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వెల్లడించడం పార్టీ వర్గాల్లోనే సంచలనంగా మారింది. మాజీ చైర్మన్ పి ఆర్ మోహన్ మాట్లాడుతూ చంద్రబాబును ఆయన పక్కన ఉండేవాళ్లే తప్పుదోవ పట్టించారని పేర్లతో సహా ప్రస్తావించడం కలకలం రేపింది. తాను ఒకప్పుడు ఎంతో బాగా బతికానని.. అయితే పార్టీ కోసం ఎంతో ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అధికారంలోకి రాగానే తనకు చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారిని అయితే ఇచ్చే విషయంలో మాత్రం చంద్రబాబు చుట్టూ ఉండే వారే ఆయన తప్పుదోవ పట్టించారని మోహన్ విమర్శించారు.
ఈ క్రమంలోనే మోహన్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఆప్తుడైన సతీష్ చంద్ర, రాజమౌళి, పీఎస్ శ్రీనివాస్ ప్రద్యుమ్న వంటి వారు జీవోలను అడ్డుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు పీఆర్ మోహన్. చంద్రబాబును కార్యకర్తలు కలవాలంటే సతీష్ చంద్ర అడ్డుకునేవారని అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీనిని బట్టి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోపాలు.. నాడు కార్యకర్తలు చంద్రబాబుకు ఎంతలా దూరమయ్యారో మోహన్ మాటలే చెపుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పలువురు కార్యకర్తలే కాదు.. చివరకు పార్టీ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలను కూడా బాబును కలవకుండా చాలా మంది లాబీయింగ్ చేశారు.
దీంతో చంద్రబాబు పార్టీ నేతలకు.. పార్టీ కేడర్కు దూరమయ్యారు. ఫలితంగా ఆయన్ను ఎన్నికల టైంలో సొంత పార్టీ వాళ్లే నమ్మని పరిస్థితి వచ్చేసింది. చివరకు వీరిలో కొందరు ఎన్నికల ముందే పార్టీ మారిపోయారు. మరి కొందరు ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన వెంటనే తాము అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని చంద్రబాబుకు ఇప్పుడు తాము ఎందుకు గౌరవం ఇవ్వాలంటూ చాలా మంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బాబును తిట్టి మరీ పార్టీని వీడుతున్నారు.