2014లో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటిఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని, 2017లో ఇందుకు సంబంధించి ఐటీఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఐటీఐఆర్ పైన ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు విజ్ఞప్తులు కూడా అందించారని, గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత కీలకమైన కార్యక్రమం పైన ఎలాంటి స్పందన రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి స్పందన లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి రంగంలో గొప్ప వృద్ధిని తెలంగాణ సాధించిందని, 2014 లో ఉన్న 57258 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులను 2019- 20 నాటికి 1,28,807 కోట్ల రూపాయలకు పెరిగేలా చేశామన్నారు. మొత్తంగా తెలంగాణ గత ఆరు సంవత్సరాలు స్థూలంగా 110 శాతం వృద్ధిని సాధించిందని, ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ అని తెలిపారు.
అలానే తెలంగాణలో ఐటి ఉద్యోగుల సంఖ్య సైతం దాదాపుగా రెట్టింపు అయిందని, హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ వంటి సంస్థలు నగరాన్ని తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా ఎంచుకున్నాయని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీంతో పాటు ఇన్నోవేషన్ రంగంలోనూ టి హబ్, టి వర్క్స్, వి హబ్, టాస్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ చేపట్టిందన్నారు. ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ పథకాన్ని లేదా అంతకు మించి మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే ఐటీ పరిశ్రమకి దాని వృద్ధికి బలమైన ఊతం ఇస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఐటిఐఆర్ ని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణలో అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి