అక్టోబరు 30 వతేదీన బద్వేలు ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో నోటిఫికేషన్ అక్టోబరు 1వ తేదీన విడుదలవుతుంది. 8వతేదీ వరకూ నామినేషన్లను స్వీకరించాల్సి ఉంటుంది. ఇక అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్ని కల సంఘం ప్రకటించింది. మరో వైపు బద్వేల్ తో పాటు తెలంగాణలో ని హుజూరా బాద్ ఉప ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది.
ఇక బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ నుంచి ప్రతిపక్షాలకు ఏకగ్రీవం చేయాలని వినతులు వస్తున్నాయి. గత సంప్రదాయాలను గౌరవించి బద్వేలు ఉప ఎన్నికలకు విపక్షాలు దూరంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరుతున్నారు. గతంలో మృతిచెందిన శాసనసభ్యుల కుటుంబాలకు టిక్కెట్ ఇస్తే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విపక్షాలను తాము పోటీ పెట్టవద్దని అనడం లేదని, సంప్రదాయాలను గౌరవించాలని మాత్రమే కోరుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వాళ్లు ఇక్కడ అభ్యర్థులను పోటీ పెడితే తాము కూడా సీరియస్ గా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం అప్పటి పరిస్థితులు వేరని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం కొసమెరుపు. మరి ఈ వినతులను ప్రతిపక్షాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత వరకు ఓకే చేస్తాయో ? చూడాలి.