కరోనా నుండి దేశం కోలుకుంటోంది ..రోజువారీ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రంపంచాన్ని అలుముకున్న నీలి ఛాయలు ఇపుడిపుడే వీడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ లు అంటూ కొందరు మళ్ళీ ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారు. అవి ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయి, వాటి వ్యాప్తి ఎలా ఉంది అని పూర్తిగా తెలుసుకోకుండానే కొందరు వార్తలను అందరికీ షేర్ చేస్తూ ఆందోళన పెంచుతున్నారు. కానీ ప్రస్తుత సమాచారం మేరకు దేశంలో కరోనా బాగా అదుపులోకి వచ్చింది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రికవరీ రేటు కూడా బాగా పెరిగి బాధితులు వైరస్ నుండి కోలుకుంటున్నారు.

వైరస్ సోకినప్పటికి హాస్పిటల్ లో చేరాల్సిన స్థాయిలో పెద్దగా ప్రభావం ఉండటం లేదు అంటున్నారు వైద్యులు. తాజా సమాచారం మేరకు భారత ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కరోనా వైరస్ వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఇపుడు మొత్తం కేసులు సంఖ్య 4,30,31,958కు చేరింది. ఇందులో ఇప్పటి వరకు 4,24,98,789 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని బయటపడగా మరో 11,639 మంది చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అని సమాచారం.

ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో 5,21,530 మంది మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 1,222 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు, అలాగే 43 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని అంటున్నారు.  రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా ఉందని పేర్కొంది. కరోనా కోరల నుండి దేశం బయటపడుతున్న సమయంలో పూర్తిగా మహమ్మారి నుండి రక్షణ పొందేందుకు జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: