
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 11,257 మంది విద్యార్థులు ఎంబైపీసీ వైపు మొగ్గు చూపడం గమనార్హం. వీరిలో 7,400 మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంచుకోగా, 3,613 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని ఎంచుకున్నారు. ఇంతవరకు వేర్వేరుగా ఉన్న రెండు విభాగాలను కలిపి చదివే అవకాశం దొరకడంతో విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలలో ఒకేసారి చదివే ఛాన్స్ వచ్చింది. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్టియర్లో 5,40,924 మంది విద్యార్థులు చేరారు. కోర్సుల నిర్మాణంలోనూ బోర్డు మార్పులు చేసింది. ఎంపీసీలో ఎ, బి లుగా ఉన్న గణితాన్ని ఒకే సబ్జెక్టుగా మార్చగా, బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా తీసుకువచ్చింది. దీని వల్ల ఇకపై అన్ని గ్రూపుల్లోనూ ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉండనున్నాయి. ఇది బోధన, పరీక్షా విధానంలో సరళతకు దోహం చేయనుంది.
అలాగే పరీక్షల షెడ్యూల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు గణితం, జీవశాస్త్రం ఒకే రోజున జరిగేవి. కానీ ఎంబైపీసీ విద్యార్థులకు ఇది సాధ్యం కానందున, ఇకపై రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల పరీక్షల వ్యవధి పెరుగుతుందని, అందుకే మార్చి బదులు ఫిబ్రవరి నుంచే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం మీద ఈ సంస్కరణలు విద్యార్థులకు విస్తృత అవకాశాలను అందిస్తున్నాయి. ఒకే సమయంలో ఇంజినీరింగ్, మెడికల్ వంటి వేర్వేరు రంగాలలో తమ ప్రతిభను పరీక్షించుకునే అవకాశాన్ని కల్పించడం వల్ల, భవిష్యత్తులో కెరీర్ ఎంపికలో మరింత స్వేచ్ఛ లభించనుంది. రాష్ట్ర విద్యా చరిత్రలో ఇవి నిజమైన విప్లవాత్మక మార్పులుగా నిలుస్తాయని చెప్పవచ్చు.