
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందస్తుగానే వేడెక్కుతోంది. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో సీట్ల సర్దుబాటు అంశం ఇప్పుడే చర్చకు వచ్చింది. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఈ పంచాయితీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న యువ నాయకుడు, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షునిగా ఉన్న దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ, ఆ తర్వాత వైసీపీలో చేరిన అవినాష్, వివిధ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ, ఆయన రాజకీయ ప్రయాణం నిరంతరం కొనసాగుతోంది.
రానున్న ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో అవినాష్ తన వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం. ఢిల్లీ రాజకీయాలు తన వల్ల కాదని, తాను లోకల్ గానే ఉంటూ, రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేయాలని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన తండ్రి దేవినేని నెహ్రూ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నానని, ఆయనలాగే తాను కూడా అసెంబ్లీకే పోటీ చేస్తానని అవినాష్ నొక్కి చెప్పినట్లు సమాచారం. నెహ్రూ సైతం తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగానే పోటీ చేశారని, అదే తన ఆకాంక్ష అని అవినాష్ పేర్కొంటున్నారట.
ఈ నేపథ్యంలో అవినాష్ రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పరిణామాలు రాబోయే ఎన్నికలకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు