అధికార బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ మరియు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీపడ్డారు. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లలో కాస్త వెనుకంజలో ఉన్న హస్తం పార్టీ.. ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమైన తరువాత ఒక్కసారిగా దూసుకుపోయింది! జూబ్లీహిల్స్ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ పోరాటంలో.. తొలి మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యం సాధించారు. తాజా ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై సుమారు 3,400 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఈ ఆధిక్యం.. కారు పార్టీ కంచుకోట బద్దలయ్యే దిశగా సాగుతోందనే సంకేతాలను స్పష్టంగా ఇస్తోంది.
పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, కీలకమైన ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, సోమాజిగూడ డివిజన్లలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటూ వెళ్లడం బీఆర్ఎస్కు పెనుసవాల్గా మారింది. నేతల గుండెల్లో దడ! .. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఫలితం తెలంగాణ రాజకీయాలపై భారీ ప్రభావాన్ని చూపనుంది. నగరంలో బీఆర్ఎస్ పట్టు సడలిపోలేదని నిరూపించుకోవాలని చూసిన కేటీఆర్కు ఈ ట్రెండ్లు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నాయి. మరోవైపు, అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కాంగ్రెస్ సాధించబోయే మొట్టమొదటి విజయం ఇదే కాబోతుందని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడనుండగా.. కాంగ్రెస్ పార్టీ ఈ కీలకమైన ‘హిల్స్’ను ఎక్కి.. తన విజయ పతాకాన్ని ఎగురవేస్తుందా, లేదా చివరి క్షణంలో బీఆర్ఎస్ మ్యాజిక్ చేస్తుందా అనేది వేచి చూడాలి! మొత్తానికి, జూబ్లీహిల్స్ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో నయా చరిత్రను లిఖించబోతోందనేది మాత్రం పక్కా!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి