తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి! అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకముందే... రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైంది. ఇది కేవలం పల్లెటూరి పోరు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి అగ్నిపరీక్ష! ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో... మూడు ప్రధాన పార్టీలు (కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ) ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రేటర్ రాజకీయం: కాంగ్రెస్ కబ్జా వ్యూహం! .. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థానిక సమరాన్ని ఢిల్లీ లెవల్‌లో అత్యంత సీరియస్‌గా తీసుకుంది.

ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC)లో పట్టు సాధించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేసిన పాచిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేయడమే ఈ 'మాస్టర్ స్ట్రోక్'! గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన కాంగ్రెస్... ఇప్పుడు వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా జీహెచ్‌ఎంసీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.అంతేకాదు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే... కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి వరాలు ప్రకటించడం ద్వారా... మహిళా ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

కేటీఆర్ రోడ్ మ్యాప్: బీఆర్‌ఎస్ ప్రతీకారం తీరుతుందా? .. అధికార పీఠం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీకి ఈ స్థానిక ఎన్నికలు ప్రతీకారం తీర్చుకునే అవకాశం! పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని, నియోజకవర్గాల స్థాయిలో పర్యటనలు చేపట్టనున్నారు. పల్లెల్లో తమ పట్టు జారిపోలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కేటీఆర్‌పై ఉంది.మరోవైపు, బీజేపీ కూడా స్థానిక ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యనేతలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశమై... అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. మొత్తంగా, వచ్చే మూడు నుంచి నాలుగు నెలలు తెలంగాణ రాజకీయం భగ్గుమనే వాతావరణం ఖాయం! స్థానిక ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలంటే వేచి చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: