తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది! సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, సొంతూరి వాసులు పడే ప్రయాణ కష్టాల పర్వం కూడా! ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు తమ దోపిడీని నవంబర్ నుంచే ప్రారంభించి ప్రయాణికులకు షాకిస్తున్నాయి. సాధారణంగా జనవరిలో వచ్చే పండుగ కోసం... నవంబర్ నుంచే టికెట్లు బుక్ చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇప్పటికే రైల్వే, ఆర్టీసీ బస్సులలో టికెట్లు దొరకడం గగనమైంది. దీనికి ప్రధాన కారణం, రైల్వే మరియు ఏపీఎస్ ఆర్టీసీ ఇంకా అదనపు ప్రత్యేక సర్వీసుల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే!

టికెట్ ధరల 'బాదుడు': రూ.3,000 నుంచి రూ.5,000! .. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ఇదే అదనుగా భావించి టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మార్గాల్లో టిక్కెట్ ధరలు వేల రూపాయలు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు నాన్-ఏసీ సీటు ధర కూడా రూ.3,000 దాటింది. చెన్నై నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధర రూ.3,500 వరకు ఉంది.ఆర్టీసీ లేదా రైల్వే స్పెషల్ సర్వీసులు రావడం ఆలస్యమైతే ధరలు మరింత పెరుగుతాయన్న భయంతో... చాలా మంది ప్రయాణికులు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు.

పేద, మధ్యతరగతికి ₹12,000 భారమే! .. ఈ ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే... ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున లెక్కేసినా, రూ.12,000 కేవలం ప్రయాణానికే ఖర్చు చేయాల్సి వస్తోంది! ఇది పండగ ఖర్చుల కంటే ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు లబోదిబో అంటున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే... ఏపీఎస్ ఆర్టీసీ మరియు రైల్వే అధికారులు వెంటనే స్పందించి, అదనపు బస్సులు, ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, ఈ సంక్రాంతికి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు మామూలుగా ఉండదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: