వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల వలసల పరంపర మొదలైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మేక‌తోటి సుచ‌రిత‌ జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత జగన్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల కాలం మంత్రిగా పనిచేసిన ఈమె, పదవి నుంచి తొలగించిన నాటి నుండి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గాన్ని కాదని, పార్టీ అధిష్టానం బలవంతంగా వేరే నియోజకవర్గానికి పంపడం వల్ల ఆమె ఓటమి పాలయ్యారు. నాటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు.


జగన్ తీరుపై అలిగిన సుచ‌రిత ఇక ఆ పార్టీలో కొనసాగడం వృధా అని భావించి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అధినేత జగన్ మోహన్ రెడ్డి పంథాలో మార్పు రాకపోవడం పట్ల సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో పార్టీ విఫలమవుతోందని, నేతల అభిప్రాయాలకు విలువ లేదని సదరు మహిళా మాజీ మంత్రి సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ప్రస్తుత అధికార కూటమి బలంగా ఉంది. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీరుపై కొన్ని వర్గాల్లో అసమ్మతి ఉండటంతో, రాబోయే రోజుల్లో ఆ స్థానాన్ని జనసేన దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే ఆ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంటుందని ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.


జనసేన పార్టీ సైతం బలమైన సామాజిక వర్గ నేపథ్యం కలిగిన నేతలను ఆహ్వానించడానికి సానుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ మాజీ మంత్రి చేరికకు పచ్చజెండా ఊపినట్లు ప్రచారం సాగుతోంది. సుచ‌రిత‌కు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, మంత్రిగా చేసిన అనుభవం పార్టీకి కలిసి వస్తాయని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆమె అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు వైసీపీ స్థానిక నాయకత్వం ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. జగన్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్లే తాను పార్టీని వీడాల్సి వస్తోందని ఆమె తన అనుచరులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ కోటలో బలమైన నేతగా గుర్తింపు పొందిన సుచ‌రిత‌ జనసేనలో చేరడం ఖాయమని తేలడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆమె పార్టీని వీడితే ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతను వెతుక్కోవడం వైసీపీకి పెను సవాలుగా మారనుంది. గెలిచే గుర్రాల కంటే నమ్మకస్తులకే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న వైసీపీ నాయకత్వానికి, ఇలాంటి సీనియర్ నేతల నిష్క్రమణ పెద్ద దెబ్బేనని చెప్పాలి. జనసేనలోకి ఈమె చేరిక అధికారికంగా ఖరారైతే, రాబోయే రోజుల్లో మరికొంత మంది మాజీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పరిధిని మరింత వేగంగా విస్తరించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: