ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టులో అద్భుత ఆట తీరుతో ఆదరగొడుతోంది. తొలి రెండు రోజులూ బ్యాటింగ్ లో సత్తా చాటిన ఇంగ్లాండ్ మూడో రోజు బౌలింగ్ లోనూ రాణిస్తోంది. అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ హీరో, ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్(218)తో పాటు బెన్ స్టోక్స్(82).. ఇద్దరినీ పెవిలియన్ కు చేర్చి స్పిన్నర్ షెహెబాజ్ నదీమ్ సత్తా చాటాడు. ఈ విషయంపై నదీమ్‌ మాట్లాడుతూ.. బెన్ స్టోక్స్ కు బౌలింగ్ చేసేప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు నదీమ్ చెప్పాడు. 'ఆఫ్‌సైడ్‌ ఆఫ్ స్టంప్‌ వైపున పిచ్ గరుకుగా ఉంది. ఆ ప్రాంతాల్లో బంతులు వేసి స్టోక్స్ ను ఇబ్బంది పెట్టాలనుకున్నాను. కానీ స్టోక్స్‌ రివర్స్‌ స్వీప్‌తో నా బౌలింగ్ పై ఎదురుదాడి చేశాడు. దాంతో నేనే నా లైన్‌ మార్చుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి స్టంప్స్‌కు మాత్రమే బంతి విసిరి స్టోక్స్ ను ఔట్‌ చేశాన'ని నదీమ్‌ చెప్పాడు.


ఇక రూట్ వికెట్ గురించి మాట్లాడుతూ.. రూట్‌ గొప్ప ఆటగాడని, మంచి ఫామ్‌లో ఉన్నాడని నదీమ్ చెప్పాడు. 'రూట్ బంతిని చక్కగా స్వీప్‌ చేస్తున్నాడు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా. బంతి ఎక్కడ వేయాలన్న దానిపై బాగా కసరత్తు చేశా. అతడు పొరపాటు చేసేవరకు ఎదురుచూశా. చివారికి వికెట్ దక్కించుకున్నా' అని నదీమ్ వివరించాడు.

ఇదిలా ఉంటే మ్యాచ్ లో ఇప్పటి వరకు నదీమ్ 6 నోబాల్స్‌ విసిరాడు. దాంతో బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. 'నా బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయి. నెట్స్‌లో ఇంకా సాధన చేస్తున్నాను. అక్కడే నా తప్పులు దిద్దుకుంటాన'ని నదీమ్ అన్నాడు.


ఇక తొలి టెస్టుపై ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ 218 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ సిబ్లీ 87, స్టోక్స్ 82 రాణించారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.


రోహిత్ శర్మ 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ గిల్ కూడా 29 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత రహానే(1), కెప్టెన్ కోహ్లీ(11) కూడా నిరాసపరిచారు. అయితే పుజారా(73) పంత్(91) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే పుజారా అవుట్ తర్వాత పంత్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ 91 పరుగుల వద్ద అవుతాయి మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 257/6 తో కష్టాల్లో ఉంది. అశ్విన్(8), సుందర్(33) క్రీజులో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: